హుజూరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుజూరాబాద్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నాడు, మరి మేము కూడా తలుచుకుంటే ప్రధాని మోడి మీద మాట్లాడలేమా..? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల వాళ్లు సంతోషంగా ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలను అక్కున చెర్చుకున్న వ్యక్తి కెసిఆర్ అని తలసాని అన్నారు.
కరోనా సమయంలో ప్రజల పక్షాన ప్రభుత్వం నిలుచున్నామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారని అన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్కు మద్దతుగా ఉన్నారని రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని అన్నారు. గోడ గడియారాలు, బొట్టు బిళ్లలు, కుట్టు మిషన్లు ఇచ్చింది ఈటల రాజేందర్ కాదా..? అన్నారు. ఆయన ఎన్ని వస్తువులు పంచినా ప్రజలు ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేస్తారని ఆయన చెప్పారు. సత్య హరిచంద్రునిలా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఆయన కరీంనగర్ నియోజకవర్గానికి చేసిందేమిటనితలసాని ప్రశ్నించారు.
చట్టాలను నిబంధనలను తుంగలో తొక్కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీటింగ్ పెడుతున్నారని అన్నారు. బీజేపీ ఎన్ని రకాల కుట్రలు చేసినా ప్రజలు మాత్రం టీఆర్ఎస్నే ఆదరిస్తారని తెలిపారు. బీజేపీ పార్టీ గిల్లి కజ్జాలు పెట్టుకుని తద్వారా రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారన్నారు. సానుభూతి డ్రామాలు హుజూరాబాద్లో నడువవని అన్నారు.టిఆర్ఎస్ పార్టీ ఇరవై వేలు ఇస్తున్నదని బండి సంజయ్ జూటా మాటలుమాట్లాడుతుండని మంత్రి గంగుల కమలాకర్ ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ పార్టీ ఇరవై వేలు పంచింది అబద్దం అని.. నేను హైదరాబాద్లోని భాగ్యలక్ష్మీ అమ్మ వారి దగ్గరికి వస్తాను నువ్వు వస్తావా ..? బండి సంజయ్ ఇద్దరం ప్రమాణం చేద్దామా..? అని అని బండి సంజయ్ కి సవాల్ విసిరారు గంగుల.
అబద్దపు మాటలు మాట్లాడటం బండి సంజయ్కు అలవాటేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వల్లనే గ్యాస్ ధరలు పెరిగాయి. ఈటల రాజేందర్ గ్యాస్ మీద అన్న మాటలకు హరీశ్ రావు సవాలు విసిరితే తోక ముడిచింది వాస్తవం కాదా..? అన్నారు. ఎలక్షన్లలో ఈటెల రాజేందర్ ఐదువేలు, చికెన్, మందుబాటిల్ పంచి మమ్ములని పంచుతున్నామని బదనాం చేస్తున్నారు. వరిధాన్యం కొనుగోలు చేయమని చెప్పిందే కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కానీ టీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలు అన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండవు అని అన్నారు. రైతులు ఎంత పంట పండించినా కేంద్రం కొనడానికి ముందు కు రావాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయమని చెప్పినా కూడా రాష్ట్రప్రభుత్వం కొంటున్నదన్నారు. కానీ బీజేపీ వాళ్లు ప్రజలకు వరి కొనరని మభ్యపెడుతున్నరు.. ఎవరూ ఆందోళన పడవద్దు రైతులకు అండగా ఉండేది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని గంగుల అన్నారు. ఎక్కడ చూసినా పంటపొలాలతో హుజూరాబాద్ సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా మారింది.. ఇది కాదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అని ఆయన ప్రశ్నించా రు. గ్లోబల్స్ ప్రచారంలో బిజేపీని మించిన పార్టీ ఏది లేదు. అడగకుండానే అన్నీ ఇచ్విన మహానుభావుడు కేసీఆర్. ప్రజలంతా బీజేపీ దుష్ప్రచారాన్ని నమ్మకుండా టీఆర్ఎస్కే అండగా నిలిచి కారుగుర్తుకు ఓటేయాలన్నారు మంత్రి గంగుల.దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధును ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా ఎదగనిచ్చేందుకు చూస్తుంటే బీజేపీనేత ఈటల రాజేందర్లు మాత్రం దళితబంధును ఈసీకి లేఖ రాసి మరీ ఆపించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బాధ్యతగల ఎంపి పదవిలో ఉండి బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నాడు.
ఆయన మాటలు దళితులు ఎవరూ విశ్వసించరు. టీఆర్ఎస్ పార్టీ ఆపేది ఉంటే పదకొండు వేల మంది అకౌంట్ లలో డబ్బులు ఎలా వెస్తదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సభ పెట్టకుండా అడ్డుకున్నది బిజేపీ కాదా అని నిలదీశారు. సీఎంసభ పెడితే జన ప్రభంజనం వస్తుందని భయపడి సభను అడ్డుకున్నారని, కానీ ప్రజలంతా సీఎంవైపే ఉన్నారన్నారు. ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం తక్కువ చేసింది… గర్వంగా ఓట్లు అడిగే హక్కు మాకే ఉంది. మరీ బీజేపీ వాళ్లు ఏంచేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఓటమి భయంతో ఫస్ట్రేషన్లో ఉన్న బీజేపీ, ఈటల రాజేందర్లు దుష్ప్రచారాలు చేస్తున్నారని ప్రజలు మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కే ఓటు వేసి గెలిపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్యయాదవ్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.