కేంద్రం ధాన్యం కొనేదాకా తగ్గం.. సర్కారు మెడలు వంచైనా కొనిపిస్తం
తెలంగాణ రైతులు.. దేశంలో లేరా?
వడ్లు కొనకుంటే ఢిల్లీలో కుమ్మరిస్తం
అన్నదాతల కోసం రాజీలేని పోరాటం:
మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు
హైవేలను దిగ్బంధించిన గులాబీ దండు
కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
నేడు జిల్లా కేంద్రాల్లో మహా ధర్నాలు
నమస్తే తెలంగాణ నెట్వర్క్: తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్ఎస్ మరోసారి డిమాండ్ చేసింది. వడ్లు కొనకుండా రైతులను ఆగం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. వడ్లు కొంటామని ఒకరు, కొనబోమని మరొకరు.. నూకలు తినాలని ఇంకొకరు.. తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జాతీయ రహదారులను ముట్టడించాయి. వడ్ల కుప్పలు, వరి గొలుసులతో రైతులు తరలివచ్చి కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు.
నాగ్పూర్ జాతీయ రహదారిపై కడ్తాల్, ఆదిలాబాద్ వద్ద, బెంగళూరు జాతీయ రహదారిపై మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు వద్ద, విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, చౌటుప్పల్ వద్ద, ముంబై జాతీయ రహదారిపై సంగారెడ్డి వద్ద రాస్తారోకో చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ ప్రాంతాలతోపాటు అనేక చోట్ల టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ‘వడ్లు కొనాలని పోరాటం- రైతు బతుకుల ఆరాటం, పంజాబ్ వడ్లు కొంటరెట్లా.. తెలంగాణ వడ్లు కొనరెట్లా’, బీజేపీ పాలన బలిపీఠం- రైతు బతుకులతో చెలగాటం’, దేశం కోసం ధర్మం కోసం వడ్లు కొనాలి’ అంటూ నినదించారు. రైతులు ఎడ్లబండ్లపై ర్యాలీగా వచ్చి హైవేలను ముట్టడించారు. తెలంగాణ రైతు బతుకుల్లో చీకటి నింపేలా కుట్రలు చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై గులాబీ శ్రేణులు నిప్పులు చెరిగాయి.
రహదారులపై రణం
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో జాతీయ రహదారులు దద్దరిల్లాయి. బెంగళూరు జాతీయ రహదారిపై భూత్పూరు వద్ద ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, జైపాల్ యాదవ్, అబ్రహాం, పట్నం నరేందర్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి నల్లజెండాలతో నిరసన తెలిపారు. నాగ్పూర్ జాతీయ రహదారి నిర్మల్ జిల్లా కడ్తాల్ వద్ద దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, విఠల్రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ వద్ద ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు నేతృత్వంలో రాస్తారోకో నిర్వహించారు.
సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, పటాన్చెరులో ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్రెడ్డి, చౌటుప్పల్ వద్ద రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, విప్ గొంగిడి సునీతారెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నకిరేకల్ వద్ద ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, రవీంద్రకుమార్, సూర్యాపేటలో ఎమ్మెల్యే గాదరి కిశోర్, కోదాడ వద్ద ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, మిర్యాలగూడ వద్ద ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, జోగులాంబ గద్వాల జిల్లా హైవేపై మాజీ ఎంపీ మందా జగన్నాథం, నల్లగొండ జిల్లా పెద్దవూరలో ఎమ్మెల్యే నోముల భగత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ఎస్బీసీ నగర్ గోధుమవాగు వద్ద విజయవాడ- జగ్దల్పూర్ జాతీయ రహదారిపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ వద్ద విజయవాడ హైవేపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, బీజాపూర్ హైవే చేవెళ్ల వద్ద ఎమ్మెల్యే కాలె యాదయ్య, నాగ్పూర్ జాతీయ రహదారిపై కొంపల్లిలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉప్పల్ వద్ద ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, వరంగల్లోని నాయుడుపంప్ జంక్షన్లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్ద వరంగల్ హైవేపై డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని సాలూరా అంతర్రాష్ట్ర రహదారిపై టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ‘మా వడ్లు కొనకపోతే బీజేపీకి నూకలు చెల్లుతాయి’ అని హెచ్చరించారు.
నేడు జిల్లా కేంద్రాల్లో మహా ధర్నా..
ధాన్యం కొనబోమన్న కేంద్రంపై ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ మహా ధర్నా కార్యక్రమాలు చేపట్టనున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లాల అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయడానికి నియోజకవర్గాలవారీగా బుధవారం సన్నాహక సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లుచేశారు. రైతుబంధు సమితి ఆధ్వర్యంలో కర్షకులను భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి జిల్లా సమితిలను ఆదేశించారు.
పంటను కొనలేని దద్దమ్మ ప్రభుత్వం
కేంద్రంలో ఉన్నది తెలంగాణ రైతు పండించిన పంటను కొనలేని దద్దమ్మ ప్రభుత్వం. రైతుల కోసం కేంద్రం చేసిందేమిటో ఒక్కటి చెప్పాలి. వడ్లు కొంటామని ఒకరు, కొనబోమని మరొకరు.. నూకలు తినాలని ఇంకొకరు.. తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. నూకలు తినాలన్న బీజేపీ వాళ్లకు నూకలు చెల్లిపోయాయి. రైతులను బీజేపీ సర్కారు ఏనాడూ పట్టించుకోలేదు. యువతకు, పేదలకు సైతం చేసిందేమీ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన తెలంగాణ రైతన్న, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ హయాంలో ఉచిత నిరంతర విద్యుత్తు, పుష్కలంగా సాగునీటితో మంచి పంటలు పండిస్తుంటే, కేంద్రం మాత్రం రైతుల ధాన్యం కొనబోమంటూ వారికి అన్యాయం చేస్తున్నది. పాలిచ్చే బర్రెను, గుడ్లు పెట్టే కోడిని ఎవరూ అమ్మరు. కానీ బీజేపీ మాత్రం కోట్ల రూపాయల డిపాజిట్లున్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, లక్షల ఉద్యోగాలున్న రైల్వేను, విమానాశ్రయాలను అమ్మేసింది. ఇప్పుడు రైతులను దగా చేయాలని చూస్తున్నది. కేంద్రం పంజాబ్, ఏపీలో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతున్నది. తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నది. సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్తు ఇస్తుంటే.. మోదీ మాత్రం మోటర్లకు మీటర్లు బిగించాలంటున్నారు. దేశమంతా కేసీఆర్ను కోరుకొంటే తమ గతి ఏం కావాలని బీజేపీ నేతలు భయపడుతున్నారు. తెలంగాణ పట్ల ప్రధాని మోదీ ఆది నుంచి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. – పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
కేంద్రం మెడలు వంచి కొనిపిస్తం
తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక్కడి రైతులపై కక్ష కట్టింది. ఇందులో భాగంగా యాసంగి వడ్లను కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తున్నది. కేంద్ర మంత్రి గోయల్ రాష్ట్ర ప్రజలను అవమానించేలా నూకలు తినడం అలవాటు చేయమని చెప్పడం ఆయన అహంకారం ధోరణికి నిదర్శనం. ఇతర రాష్ర్టాల్లో రెండు పంటలు కొనుగోలు చేస్తున్న కేంద్రం, తెలంగాణ విషయంలో అన్యాయం చేస్తున్నది. రైతులను వరి సాగు చేయాలని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దమ్ముంటే కేంద్రం చేత వడ్లు కొనుగోలు చేయించాలి. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బాయిల్డ్ రైస్ను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఈ బియ్యం ఎవరూ కొనడం లేదని దగాకోరు మాటలు మాట్లాడుతున్నారు. కేంద్రం మెడలు వంచి వడ్లను కొనిపిస్తాం.
– దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
మా రైతులు.. ఈ దేశంలో లేరా?
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ వడ్లను కొనబోమని కేంద్రం చెప్తున్నది. తెలంగాణ రైతులు ఈ దేశంలో లేరా? కేంద్రం మెడలు వంచైనా ధాన్యం కొనిపిస్తాం. అన్నదాతల కోసం రాజీలేని పోరాటం చేస్తాం. ధాన్యం కొనుగోలులో కేంద్రం పంజాబ్లో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరిస్తున్నది. సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం, 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీరు అందించడంతో రైతులు పండించిన పంటను తీసుకోకుండా, కేంద్రం రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నది. 20 ఏండ్లుగా ఎట్లా కొంటున్నరో ఈ సారి కూడా అలాగే కొనాలి. లేకుంటే ఢిల్లీకి వచ్చి కేంద్రం, బీజేపీ నేతల ముఖాన ధాన్యాన్ని కుమ్మరిస్తం.
– రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి
రైతు నిరసన సెగ ఢిల్లీకి తగలాలె
ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురాలె
నేటి ధర్నాను విజయవంతం చేయాలి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి
వనపర్తి, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు విషయమై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనల్లో భాగంగా శుక్రవారం ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగురవేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టి నిరసనల సెగ ఢిల్లీకి తగిలేలా చూడాలన్నారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రానిది బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. బుధవారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి ఈ రాష్ర్టానికి బీజేపీ నేతలు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలది చేతగానితనమన్నారు. రైతుల ఆందోళనలు చూసైనా మోదీ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.