జమ్మికుంట: తాను పేదింటి బిడ్డనని, కష్టాలు తెలిసినవాడినని, ఆదరిస్తే సమస్యలన్నీ తీరుస్తానని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. జమ్మికుంట మండలంలోని మాచనపల్లి, పెద్దంపల్లి, జగ్గయ్యపల్లి గ్రామాల్లో ఆయన మండల ఇన్చార్జి, ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. డమ్మీ పాదయాత్ర చేసిన బండి సంజయ్కి టీఆర్ఎస్ పాలనే బాగుందని ప్రజలు చెప్పారన్నారు. బీజేపీ మాయమాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని గెల్లు శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలకు హుజూరాబాద్ వచ్చి ఓట్లడిగే ధైర్యంకూడా లేదన్నారు. గ్రూప్ రాజకీయాలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని గెల్లు అభివర్ణించారు.
ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ను విమర్శించే స్థాయి ఈటల రాజేందర్కు లేదన్నారు. ఓట్ల కోసం ఈటల రాజేందర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజకీయంగా పెంచి పెద్దచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్నే ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. హుజూరాబాద్ ప్రజలు ఈటలకు తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే రమేశ్ పేర్కొన్నారు. బండి సంజయ్ పాదయాత్ర అంతా పెద్ద డ్రామా అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి విమర్శించారు. కేవలం హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న నాటకమని పేర్కొన్నారు. ఈ పాదయాత్రతో బండి సంజయ్ ఏం సాధించారో ప్రజలకు చెప్పాలని కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు శ్రీధర్రెడ్డి, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిలి రమేశ్, జడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ ,ఎంపీపీ దొడ్డే మమత, క్లస్టర్ ఇన్చార్జి రాంబాబు, రైతు సమన్వయ సమితి జిల్లా మెంబర్ లింగారావు , పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.