కోల్కతా : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఖండించింది. ఈ వ్యాఖ్యలతో విపక్ష ఇండియా కూటమికి సంబంధం లేదని స్పష్టం చేసింది. స్టాలిన్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, సామరస్యం అనేది మన సంస్కృతి..ఇతర మతాలను మనం గౌరవించాలని టీఎంసీ ప్రతినిధి కునాల్ ఘోష్ పేర్కొన్నారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలతో విపక్ష కూటమికి ఎలాంటి సంబంధం లేదు..ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మనం ఖండించాలని ఘోష్ స్పష్టం చేశారు. సనాతన ధర్మం సమానత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, ఇది కరోనా, డెంగ్యూ, మలేరియా వంటిదని, అలాంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఉదయనిధి వ్యాఖ్యలను బీజేపీ నేత, కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై తోసిపుచ్చారు.
స్టాలిన్ ఆలోచనాధరోణి దోమ అంతటి చిన్నదని, మలేరియా అంతటి మురికితో కూడుకున్నదని దుయ్యబట్టారు. ఉదయనిధి స్టాలిన్ ఓ హిట్లర్ అని మండిపడ్డారు. మరోవైపు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ సమర్ధించింది. సమానత్వాన్ని ప్రోత్సహించని, మనిషిని మనిషిగా గౌరవించని ఏ మతమైనా మతం కాదని కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే వ్యాఖ్యానించారు. సమాన హక్కులు ఇవ్వని ఏమతమైనా, మిమ్మల్ని మనిషిగా చూడని మతమేదైనా అది వ్యాధి వంటిదని అన్నారు.ఇక అన్ని ధర్మాలను సమభావంతో చూడటమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. ప్రతి రాజకీయ పార్టీకి దాని అభిప్రాయాలు వెల్లడించే స్వేచ్ఛ ఉందని, ప్రతి ఒక్కరి విశ్వాసాలను తాము గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు.
Read More :