తెలియమార్.. ఛత్తీస్గఢ్లోని కుగ్రామం. చుట్టూ చిట్టడవి. గిరిజన మహిళ దువాసియా పొలంలో పనిచేసుకుంటున్నది. దూరంగా ఆమె కూతురు రింకీ ఆడుకుంటున్నది. అంతలోనే వింత శబ్దం. చెవులు రిక్కించి విన్నది దువాసియా. అడవి పంది చుట్టుపక్కల సంచరిస్తున్నదని ఆమెకు అర్థమైపోయింది.
‘బిడ్డా జాగ్రత్త..’ అని కూతుర్ని హెచ్చరించింది. పసిపిల్ల పట్టించుకోలేదు. తన ప్రపంచం తనది. ఆ ఆదమరపును గ్రహించిందేమో, పొదలలోంచి అడవిపంది బయటికొచ్చింది.
ఆ మృగాన్ని చూడగానే ‘అమ్మా..’ అంటూ ఏడుపు అందుకుంది రింకీ. ప్రమాదం అర్థమైపోయి పరుగుపరుగున వచ్చింది దువాసియా. భారీ అడవిపంది. భయంతో ఒళ్లు జలదరించింది. కానీ వెనకడుగు వేయలేని పరిస్థితి. అప్పటికే రింకీ కాలిని నోటితో కరిచేసుకుంది. చేతిలోని కొడవలే ఆయుధంగా ఎదురుదాడికి దిగిందామె. ప్రతిఘటన ఎదురయ్యేసరికి.. చిన్నారిని వదిలిపెట్టి తల్లివైపు దూకింది. పారిపొమ్మంటూ కూతురికి సైగ చేసింది దువాసియా. బిడ్డ మలుపు తిరిగేంతవరకూ శత్రువును నిలువరిస్తూనే ఉందామె. బిడ్డ సురక్షితమని తెలియగానే.. ఊపిరి పీల్చుకుని.. పోరాటంలో తుదిశ్వాస విడిచింది. అంతలోనే జనం గుమిగూడారు. అడవిపంది అడవిపైపు పరుగుపెట్టింది. ఆ తల్లి ప్రాణత్యాగాన్ని కీర్తిస్తూ.. దువాసియాను ఊరేగింపుగా పల్లెకు తీసుకెళ్లారు. ఆ మాతృమూర్తి అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. తల్లీ నీకు జోహార్!