ఉట్నూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్తోనే ఆదివాసీల అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే రేఖానాయక్, మాజీ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. దీపావళి పండుగకు గుస్సాడీలకు నిధులు కేటాయించినందుకు గురువారం స్థానిక కొమురంభీం ప్రాంగణంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో మండల ఆదివాసీ నాయకులు కృతజ్ఞతగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆదివాసీ ప్రాంతాలను ఏ ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక గ్రామాలకు బీటీ రోడ్లు, 500 జనాభా ఉన్న గ్రామాలను జీపీలుగా ఏర్పాటు చేసి గిరిజనులనే సర్పంచ్లుగా చేసి వారి సమస్యలను వారిచేత పరిష్కరిస్తున్నామన్నారు.
దండారి ఉత్సవాలను ప్రతి సంవత్సరం కోటి రూపాయలు ముంజూరు చేస్తూ దీపావళి పండుగలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఆదివాసుల ఆరాధ్య దైవం కొమురంభీం మ్యూజియం ఏర్పాటు, నాగోభ ఆలయానికి, ఇతర దైవ ప్రాంతాలకు నిధులు ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, నర్సాపూర్-బీ సర్పంచ్ పెందూర్ కళావతి, మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి, ఆదివాసీ తొమ్మిది తెగల నాయకులు, గ్రామ పటేళ్ళు, గిరిజనులు పాల్గొన్నారు.