యాదగిరిగుట్ట రూరల్, మార్చి 20 : కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి యాదాద్రి క్షేత్ర పరిధిలోని గండి చెరువుకు గోదావరి జలాలు రానున్న సందర్భంగా యాదగిరిగుట్ట మండలం జంగంపల్లి వద్ద ఉన్న ఓటీ 2 కాల్వ వద్ద ఇరిగేషన్ అధికారులు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. నృసింహ రిజర్వాయర్ ప్రధాన కాల్వ నుంచి వచ్చే జంగపల్లి ఓటీ 2కాల్వ వద్ద అధికారులు నిర్వహించిన ట్రయల్ రన్తో కాల్వలోకి నీరు వచ్చాయి. ఈ నీటిని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సోమవారం విడుదల చేయనున్నారు. నేటి నుంచి 28వరకు యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వామి వారి తెప్పోత్సవాన్ని గండి చెరువులోనే నిర్వహించనుండగా ఆలయానికి, భక్తులకు అవసరమైన నీటిని ఇక్కడి నుంచే అందించనున్నారు. నీటి కోసం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి గండి చెరువుకు నీటిని తరలిస్తున్నది. ట్రయల్ రన్ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, ఈఈలు వేణుగోపాల్రావు, ఖుర్షీద్, డీఈ సునిల్ప్రసాద్, ప్రాజెక్టు మేనేజర్ రమణారెడ్డి పాల్గొన్నారు.