అన్నార్తుల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ కేంద్రాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. రూ.5లతో కమ్మటి భోజనం అందిస్తున్న ప్రభుత్వం.. కేంద్రాల వద్ద కూర్చొని తినేలా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నది. ప్రైవేటు భోజనశాలలకు తీసిపోకుండా టేబుళ్లు, కుర్చీలు, ఫ్యాన్లు, వాష్బేసిన్, తాగునీటి సదుపాయాలు కల్పిస్తున్నారు. గ్రేటర్వ్యాప్తంగా 373 అన్నపూర్ణ కేంద్రాలుండగా, బల్దియా జోన్కొకటి చొప్పున 32 కేంద్రాల్లో అధునాతన సౌకర్యాలు కల్పించింది. ఒక్కోదాని ఆధునీకరణకు రూ.10 లక్షలు వెచ్చించారు. చిరు వ్యాపారులు, కార్మికులు, హమాలీలు, విద్యార్థులు, బ్యాచిలర్లు నిత్యం నాణ్యమైన భోజనంతో కడుపు నింపుకుంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 1,76,14,332 మందికి భోజనం అందించినట్లు అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): ఏ ఒకరూ ఆకలితో అలమటించవద్దని సంకల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రేటర్ వ్యాప్తంగా 373 చోట్ల ఐదు రూపాయల భోజన కేంద్రాలను ఏర్పాటు చేసి నాణ్యమైన పోషకాహారాన్ని అందిస్తున్నారు. రుచి, శుచి సమతుల పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తుండటంతో వలస కార్మికులు, విద్యార్థులు, బ్యాచిలర్లు, చిరుద్యోగులు కడుపు నింపుకుంటున్నారు. 2021 -22 ఆర్థిక సంవత్సరంలో 1,76,14,332 మందికి ఐదు రూపాయల భోజనాన్ని పంపిణీ చేశారు. ఇలా అన్నపూర్ణ కేంద్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో సకల సౌకర్యాలతో అన్నపూర్ణ భోజనశాలలుగా మార్చుతున్నారు. గ్రేటర్వ్యాప్తంగా 32 అన్నపూర్ణ క్యాంటీన్లలో సిట్టింగ్ ఏర్పాటు చేసినట్లు మంగళవారం అధికారులు పేర్కొన్నారు. జోనల్ వారీగా ఒక్కో కేంద్రంలో సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. ప్రైవేట్ భోజనశాలలకు తీసుపోని విధంగా కూర్చొని తినేలా టేబుళ్లు, కుర్చీలు, గాలి వెలుతురు వచ్చేలా ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు అమర్చారు. అన్నం తిన్న తర్వాత చేతులు శుభ్రం చేసుకునేందుకు ప్రత్యేకంగా వాష్బేషిన్ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఆకలి తీర్చడమే కాకుండా సంతృప్తిగా భోజనం చేశామన్న అనుభూతి కలిగేలా ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం.
7.41 కోట్ల మందికి ఆసరా..
2014లో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా 8 అన్నపూర్ణ సెంటర్లను ప్రారంభించిన ప్రభుత్వం నిర్విరామంగా పేదల ఆకలి తీరుస్తూ వస్తున్నది. ఇప్పటి వరకు 7 కోట్ల 41 లక్షల 28 వేల 577 మందికి అధికా రులు భోజనం అందించారు. కొవిడ్ -19, లాక్డౌన్ సమయాల్లో 259 కేంద్రాలు ఏర్పాటు చేసి నిరాశ్రయులు, వలస కార్మికులు, నిరుపేదలకు ఉచితంగా భోజన వసతి కల్పించారు.
జోన్ :ఏర్పాటు చేసిన కేంద్రాలు
ఎల్బీనగర్ :కాప్రా, ఉప్పల్, హయత్నగర్, సరూర్నగర్, ఎల్బీనగర్
చార్మినార్ :మలక్పేట్, సంతోష్నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నామ, రాజేంద్రనగర్
ఖైరతాబాద్: కార్వాన్, గోషామహల్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి, చందానగర్, కూకట్పల్లి, మూసాపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్
సికింద్రాబాద్: ముషీరాబాద్, అంబర్పేట్, మలాజిగిరి, సికింద్రాబాద్, బేగంపేట్