హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలకు ప్రిపేరయ్యే గిరిజన బిడ్డలకు దశలవారీగా కోచింగ్ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమశాఖ కార్యాచరణ రూపొందించింది. ముఖ్యం గా ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్ 1, 4 ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే గిరిజన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 55 కేంద్రాలను ఏర్పాటుచేసింది. కనీసం 16,500 మందికి శిక్షణ ఇవ్వాలని గిరిజన సంక్షేమశాఖ లక్ష్యంగా పెట్టుకొన్నది. ఈ శిక్షణ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ కోసం 16 మంది రాష్ట్రస్థాయి అధికారులను ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ నియమించారు. స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేసి శిక్షణ ఇస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ కోసం ఆన్లైన్లో (studycircle.cgg.gov.in/tstw) ఈ నెల 11లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉన్నది. అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్, కరెంట్ ఎఫైర్స్ మొదలైన అంశాలపై 100 మార్కుల ఆబ్జెక్టివ్ టైపు విధానంలో స్క్రీనింగ్ టెస్ట్ ఈ నెల 24న నిర్వహిస్తారు. 28న ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నెల 30న సర్టిఫికెట్ల పరిశీలన, మే ఒకటి నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తారు. మూడు నెలలకు ఒక బ్యాచ్, బ్యాచ్కు 5,500 చొప్పున మొత్తం 16,500 మంది గిరిజన ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అభ్యర్థులకు వసతి, భోజన సౌకర్యంతోపాటు ఉచిత శిక్షణ అందించేందుకు గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 80 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ కాబోతున్నాయి. ఈ తరుణంలో పట్టణాల్లో, నగరాల్లో ఉంటూ పోటీపరీక్షలకు ప్రిపేర్ కాలేని గిరిజన బిడ్డలకు సీఎం కేసీఆర్ గొప్పవరం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోనూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని భావించాం. అధికారులు ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ గొప్ప అవకాశాన్ని గిరిజన బిడ్డలు ఉపయోగించి ఉద్యోగాలు పొందాలి.
– రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్