చెరువులో మునిగి నలుగురు బాలురు మృతి
సంగారెడ్డి జిల్లాలో కమలాపూర్లో విషాద ఘటన
మనూరు, మార్చి 25: ఈత సరదా నలుగురి ప్రాణాలను తీసింది. చెరువులోకి దిగిన నలుగురు విద్యార్థులు నీటమునిగి చనిపోయారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని కమలాపూర్లో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నారాయణఖేడ్ సమీపంలోని మంగళ్పేట్కు చెందిన నాయకుని శ్రీనివాస్ కుమారుడు మహేశ్ (12), కోట పండరీ- రేణుక దంపతుల ఇద్దరు కొడుకులు సాయిచరణ్ (11), సాయి సంపత్ (12), కల్హేర్ మండలం ఖానాపూర్కు చెందిన ర్యాకల రాములు కొడుకు వినోద్ (10) స్నేహితులు. వీరిలో వినోద్, సాయిచరణ్ ఐదో తరగతి.. సంపత్ ఆరో తరగతి, మహేశ్ ఏడో తరగతి చదువుతున్నారు. గురువారం వీరంతా కలిసి నారాయణఖేడ్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆవరణలోని తాళాలు వేయని మూడు సైకిళ్లను దొంగిలించి మనూరు మండలం కమలాపూర్ సమీపంలో ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. సైకిళ్లు, దుస్తులు చెరువు కట్టపై పెట్టి నీటిలోకి దిగారు.
నలుగురికీ ఈత రాకపోవడంతో నీట మునిగి మృతిచెందారు. సాయంత్రం సమయంలో చెరువు కట్టపై సైకిళ్లు, దుస్తులను గమనించిన స్థానికులు పరిసరాల్లో వెతికారు. చెరువులో ఒకరి మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని మహేశ్గా గుర్తించారు. అప్పటికే చీకటి పడటంతో మిగిలిన వారికోసం గాలింపును నిలిపేశారు. శుక్రవారం ఉదయాన్నే గజ ఈతగాళ్ల సాయంతో మిగతా ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి నారాయణఖేడ్ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.