నిజామాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మెండోరా మండలం పోచంపాడు వీఐపీ పుష్కరఘాట్ వద్ద గోదావరిలో స్నానానికి వెళ్లిన ఆరుగురు మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు..తొలుత ఐదుగురు నదిలో స్నానానికి వెళ్లి మునిగిపోయారు.
వారిని కాపాడేందుకు మరో ఇద్దరు వెళ్లి వారు కూడా గల్లంతయ్యారు.
వీరిలో ఆరు మృతదేహాలను బయటకు తీయగా.. గల్లంతైన మరో చిన్నారిని స్థానికులు కాపాడారు.
శుక్ర వారం ఉదయం ఎల్లమ్మగుట్ట, డీకంపల్లి, మాక్లుర్, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన మూడు కుటుంబాలవారు గోదావరిలో స్నానానికి వెళ్లారు. ప్రతి శుక్రవారం గోదావరిలో తెప్ప దీపం సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తుంటారు.
ఈ క్రమంలో ఈరోజు ఉదయం స్నానాలు చేసేందుకు నదిలో దిగిన సమయంలో ప్రమాదవశాత్తు ఇద్దరు చిన్నారులు నదిలోకి జారిపోయారు. వారిని కాపాడేందుకు మరో ఐదుగురు నదిలోకి దిగారు.
ఇందులో ముగ్గురు పెద్దలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. స్థానికులు ఒక బాలుడిని సురక్షితంగా కాపాడారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో ఆరు మృతదేహాలను వెలికితీశారు.
మృతులు నిజామాబాద్ ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్ (40), అతని కుమారులు శ్రీకర్(14), సిద్దార్థ్ (16), మక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన రాజు (24), నందిపేట్ మండలం డీకంపల్లికి చెందిన యోగేష్ (16), సురేశ్(40)గా గుర్తించారు.
ఘటనా స్థలికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిజామాబాద్ నగరం ఎల్లమ్మ గుట్టతోపాటు మాక్లూర్ మండలంలోని డీకంపల్లి, గుత్ప గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల దిగ్భ్రాంతి..
పోచంపాడు పుష్కర ఘాట్ దగ్గర గోదావరి నదిలో ఆరుగురు మృతి చెందడంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
స్నానానికి గాను నదిలో దిగి దురదృష్టవశాత్తు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని వారు తెలిపారు.