హైదరాబాద్ : నగరంలో ఆదివారం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. సండే- ఫన్డేలో చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్కే నామ్’పేరిట కార్యక్రమాలు జరుగున్నాయి. ఈ సందర్భంగా అఫ్జల్గంజ్, మదీనా నుంచి వచ్చే ట్రాఫిక్ను గుల్జార్ హౌస్ వద్ద మెట్టికా షేర్, కలికామన్, ఈతేబార్ చౌక్ వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
ఫలక్నుమా, హిమత్పురా నుంచి వచ్చే వాహనాలను పంచమోహల వద్ద చార్మినార్, షా ఫంక్షన్ హాల్, మొఘల్పురా ఫైర్ స్టేషన్రోడ్, బీబీబజార్ వైపు మళ్లించనున్నారు. బీబీబజార్, మొఘల్పురా వాటర్ ట్యాంక్, హఫీజ్ ఢంకా మసీదు నుంచి వచ్చే ట్రాపిక్ను సర్దార్ మహల్ వద్ద కోట్ల అలీజా, ఎటెబార్ చౌక్ వైపు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. మూసబౌలి, ముర్ఘీచౌక్, ఘాన్సీబజార్ నుంచి వచ్చే ట్రాఫిక్ను లాడ్ బజార్, మోతీగల్లి వద్ద కిల్వత్రోడ్డు వైపు మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.
అఫ్జల్గంజ్, నయాపూల్, మదీనా వైపు నుంచి వచ్చే సందర్శకుల కోసం జీహెచ్ఎంసీ కార్యాలయంలో సర్దార్ మహల్, కోట్ల అలీజాలోని ముఫీద్ యూఎల్ అనం బాలుర ఉన్నత పాఠశాల, ఎస్వైజే కాంప్లెక్స్, చార్మినార్ ఏయూ హాస్పిటల్ వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. చార్మినార్ బస్ టెర్మినల్ ఇన్గేట్ మదీనా, పురానాపూల్, గోషామహల్ వైపు నుంచి వచ్చే సందర్శకుల కోసం కులీ కుతుబ్ షా స్టేడియం, ప్రభుత్వ నగర కళాశాల, ఎంజే బ్రిడ్జ్ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు వాహనదారులు సహకరించాలని కోరారు.