కట్టంగూర్, అక్టోబర్ 04 : విశ్రాంతి కోసం ట్రాక్టర్ ట్రాలీ కింద పడుకున్న డ్రైవర్ మృతి చెందిన సంఘటన కట్టంగూర్ మండలంలోని పరడ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొండూరి నరేశ్ (26) అదే గ్రామంలోని నిమ్మనగోటి భాస్కర్ ట్రాక్టర్ పై డ్రైవర్గా పని చేస్తున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో వరికోత మిషన్ తో కోసిన ధ్యాన్యాన్ని తరలించేందుకు ట్రాక్టర్ ను తీసుకెళ్లాడు. ట్రాక్టర్ లో ధాన్యం నింపుకుని అదే ట్రాక్టర్ ట్రాలీ కింద నరేశ్ విశ్రాంతి కోసం పడుకున్నాడు.
అదే సమయంలో వెనుకాల ఉన్న మరో ట్రాక్టర్ డ్రైవర్ ఎస్కే రహీమ్ తన ట్రాక్టర్ ను ముందుకు తీసుకెళ్లే క్రమంలో అడ్డుగా ఉన్న నరేశ్ ట్రాక్టర్ ను అనుమతి లేకుండా స్టార్ట్ చేసి ముందుకు జరిపాడు. దీంతో ట్రాక్టర్ కింద పడుకున్న నరేశ్ తలపై నుండి ట్రాలీ టైరు వెళ్లడంతో తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శనివారం మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు.