హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణను బొమ్మల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో పత్తి దిగుబడి, ఇతర ముడిసరుకులు పుష్కలంగా ఉండటంతో ఈ దిశగా చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శామీర్పేట్ సమీపంలోని తునికి బొల్లారంలో 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా టాయ్స్ క్లస్టర్ ఏర్పాటుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్లస్టర్లో బొమ్మల తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు మూడు ప్రముఖ కంపెనీలు ముందుకొచ్చాయి. మరికొన్ని కంపెనీలు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. పత్తి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలవడంతో ఇప్పటికే ఇక్కడ అనేక చిన్నతరహా సాఫ్ట్ టాయ్స్ పరిశ్రమలు కొలువుదీరాయి. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల పలు కుటీర పరిశ్రమలు ఈ బొమ్మలను తయారు చేస్తున్నాయి.
కేంద్రానికి ప్రతిపాదనలు
స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీజరేషన్ ఆఫ్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ పథకం కింద దేశవ్యాప్తంగా 35 టాయ్స్ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుకోసం రూ.2,300 కోట్లు కేటాయించి, ఈ ఏడాది బడ్జెట్లో ఎనిమిది టాయ్ క్లస్టర్లకు ఆమోదం తెలిపింది. వీటిలో మధ్యప్రదేశ్కు 3, రాజస్థాన్కు 2, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడుకు ఒక్కోటి కేటాయించింది. దీంతో తెలంగాణకు కూడా టాయ్స్ క్లస్టర్ను మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.
దిగుమతులకు చెక్ పెట్టేందుకు
దిగుమతులపై ఆధారపడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం దేశంలో బొమ్మల తయారీ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నది. దీనిలో భాగంగా హస్తకళలు, జీఐ బొమ్మలకు బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) నుంచి మినహాయింపు ఇవ్వడంతోపాటు, విదేశీ బొమ్మల దిగుమతిపై సుంకాన్ని పెంచింది. ఈ చర్యలు దేశంలో టాయ్స్ ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదం చేస్తాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
ముందుకొచ్చిన కంపెనీలుయూనివర్సల్ టాయ్స్ సంస్థ
జీడిమెట్లలో నెలకు లక్ష యూనిట్లు తయారుచేసే సాఫ్ట్ టాయ్స్ యూనిట్ను నిర్వహిస్తున్నది. దీని విస్తరణకు టీఎస్ఐఐసీ దండు మల్కాపూర్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. త్వరలో అక్కడ మరో భారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు యూనివర్సల్ టాయ్స్ సిద్ధమవుతున్నది. మరోవైపు బటర్ఫ్లై టాయ్స్, ఛోటాభీమ్ టాయ్స్ తదితర సంస్థలు రాష్ట్రంలో తమ యూనిట్లను స్థాపించేందుకు ప్రతిపాదనలు సమర్పించాయి. వీటితోపాటు పలు చిన్నతరహా కంపెనీలూ అధికారులను సంప్రదిస్తున్నాయి.
విస్తృత అవకాశాలు
తెలంగాణలో టాయ్స్ పరిశ్రమ అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. హస్తకళలకు రాష్ట్రం నెలవుగా భాసిల్లుతుండటం, కాటన్ దిగుబడులు అధికంగా ఉండటంతో ఇక్కడ పరిశ్రమల స్థాపనకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. దీంతో ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. రాష్ర్టాన్ని టాయ్స్ హబ్గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధంచేసి ఆ దిశగా ముందుకు సాగుతున్నాం.
వెనుకబడ్డ యూపీ, మహారాష్ట్ర
బీజేపీ పాలనలో ఉన్న ఉత్తరప్రదేశ్.. అర్ధ సంవత్సరం గడిచినా కేటాయింపుల్లో కనీసం ఐదో వంతు కూడా ఖర్చు చేయనట్లు తేలింది. మహారాష్ట్ర పరిస్థితీ ఇలాగే ఉన్నదని కేర్ రేటింగ్స్ చెప్పింది. రూ. 1,14,274 కోట్లను మూలధన వ్యయం నిధులుగా ప్రకటించిన యూపీ.. తొలి ఆరు నెలల ఖర్చు రూ. 23, 803 కోట్లే (20.8 శాతం). అలాగే మహారాష్ట్ర రూ. 59, 139 కోట్లలో చేసిన ఖర్చు రూ.8,454 కోట్లు. నిజానికి కరోనా విలయం సృష్టిస్తున్న వేళ, ప్రైవేట్ రంగ పెట్టుబడులు కష్టంగా మారిన సమయంలో అభివృద్ధికి ఆసరా ప్రభుత్వ పెట్టుబడులే. ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించేదీ సర్కారీ వ్యయమే. ఈ విషయంలో పూర్తి అవగాహన ఉన్న ప్రభుత్వం పాలనలో ఉన్నది కాబట్టే తెలంగాణ.. తాజా నివేదికలో అగ్రస్థానంలో నిలిచింది.