సిద్దిపేట, జూలై 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధిని జిల్లాల వారీగా విస్తరించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం రైల్వే ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చింది. కేసీఆర్ కృషితో సిద్దిపేటకు రైల్వే కల సాకారమైంది. కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమవడంతో ఈ ప్రాంత ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ నెల 26న సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కొమురవెల్లి రైల్వే స్టేషన్ను ప్రారంభించనున్నారు. సిద్దిపేట రైల్వేస్టేషన్, గజ్వేల్ రైల్వే స్టేషన్ ప్రారంభించుకోవడంతో ప్రతి రోజూ సికింద్రాబాద్ నుంచి మనోహరాబాద్ మీదుగా రైలు సిద్దిపేట వరకు నడుస్తున్నది. ఈ రైల్వే లైన్ నిర్మాణం కోసం కేసీఆర్ ఎంతగానో కృషి చేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్న దేవాలయానికి వచ్చే భక్తులకు రైల్వే సేవలు మరింత ఉపయోగకరంగా మారనున్నాయి. కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభంతోపాటు సిద్దిపేట జిల్లాకు రైల్వే కలను సాకారం చేసిన చారిత్రాత్మక ఘట్టంగా చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు అమలుకు పునాది వేసి, భూసేకరణ, రాష్ట్ర వాటా నిధుల విడుదల వంటి కీలక ప్రక్రియలను పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిని జిల్లా ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా చరిత్రలో కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం మరో మైలురాయిగా నిలువనున్నది. మనోహరాబాద్- కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణను వేగవంతంగా పూర్తిచేయడంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన ఆర్థిక వాటాను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్రం-రాష్ట్రం సమన్వయంతో ముందుకు సాగేలా కేసీఆర్ ప్రభుత్వం కృషిచేసింది.
దేశ చరిత్రలోనే అత్యంత త్వరితగతిన సిద్దిపేట రైల్వే లైన్ పూర్తయిందంటే కేసీఆర్ ప్రభుత్వ కృషి ఎంతో ఉన్నది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా భూ సేకరణ చేసి రైల్వే శాఖకు అప్పగించడం వల్లే సాధ్యమైంది. దేశంలో మొట్టమొదటిసారి ఒక కోర్టు కేసు కూడా లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. 2,200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి రైల్వే శాఖకు ఇచ్చింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద చెల్లించాల్సిన డబ్బులను చెల్లించింది. నిధులు సమయానికి విడుదల చేయడం వల్ల సిద్దిపేట లైన్ పూర్తయ్యింది. మొత్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు వెయ్యికోట్ల వరకు ఖర్చు చేసింది. అప్పటి ప్రభుత్వ సంపూర్ణ సహకారం, కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, హరీశ్రావు ప్రత్యేక కృషితోనే ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తిచేశారు. మనోహరాబాద్ నుంచి గజ్వేల్ మీదుగా సిద్దిపేట వరకు రైల్వేలైన్ పూర్తి కావడంతో రైలు రాకపోకలు 2023 అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో రైల్వేలైన్ పనులు జరుగుతున్నాయి. రూ.150 కోట్లతో విద్యుత్తు లైన్ పనులు జరుగుతున్నాయి.