Telecom Companies | న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశీయ టెలికం సంస్థలు రుణాలతో సతమతమవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరినాటికి నాలుగు టెలికం సంస్థల అప్పు రూ.4,09,905 కోట్లుగా ఉన్నట్లు పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోకసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర కమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
వొడాఫోన్ ఐడియా అత్యధికంగా రూ.2.07 లక్షల కోట్లు రుణం ఉండగా, భారతీ ఎయిర్టెల్ రూ.1.25 లక్షల కోట్లు, జియోకు రూ.52,740 కోట్లు, బీఎస్ఎన్ఎల్ అప్పు రూ.28,092 కోట్లుగా ఉన్నట్లు చెప్పారు. 2021-22లో బీఎస్ఎన్ఎల్కు రూ.40,400 కోట్ల రుణం ఉండగా, కేంద్ర ప్రభుత్వం పలుదఫాలుగా ప్రకటించిన పునరుద్దరణ ప్యాకేజీతో కంపెనీ రుణం రూ.28,092 కోట్లకు తగ్గినట్లు మంత్రి చెప్పారు. అలాగే బీఎస్ఎన్ఎల్కి 4జీ/5జీ స్పెక్ట్రం కేటాయించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.