న్యూఢిల్లీ, జనవరి 8 : ఆల్టైమ్ హై రికార్డులతో దూసుకుపోయిన వెండి ధర.. గురువారం భారీగా పతనమైంది. ఈ ఒక్కరోజే కిలో రేటు రూ.12,500 పడిపోయింది. దీంతో ఢిల్లీ స్పాట్ మార్కెట్లో రూ.2,43,500 వద్ద ముగిసిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది. బుధవారం రూ.5,000 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,56,000 పలికిన విషయం తెలిసిందే.
సాధారణ కొనుగోలుదారులతోపాటు పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుండటంతో ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే అంతర్జాతీయ మార్కెట్లో మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం.. ఇప్పుడు దేశీయ మార్కెట్ను ప్రభావితం చేసిందని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ఇదిలావుంటే బంగారం ధర సైతం తగ్గుముఖం పట్టింది. 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.900 దిగి రూ.1,40,500 వద్ద స్థిరపడింది.