హైదరాబాద్/కరీంనగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మంగళవారం వెలువడనున్నది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 30న ఇక్కడ జరిగిన పోలింగ్లో ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులతోపాటు మొత్తం 30 మంది పోటీపడ్డారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్కు చెందిన గెల్లు శ్రీనివాస్ యాదవ్కు, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మధ్యనే ఉంటుందని భావిస్తున్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకు రెండు కౌంటింగ్ హాళ్లను ఏర్పాటుచేశారు. ఒక్కో హాల్లో 14 చొప్పున టేబుళ్లు సిద్ధం చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపును పూర్తిచేయనున్నారు. ఒక్కో రౌండ్కు గంట సమయం పట్టవచ్చని రిటర్నింగ్ అధికారి, హుజూరాబాద్ ఆర్డీవో సీహెచ్ రవీందర్రెడ్డి చెప్పారు. లెక్కింపు సిబ్బంది, అభ్యర్థుల ఏజెంట్లు ఉదయం ఆరు గంటలకే కాలేజీకి చేరుకోవాలని శశాంక్ గోయల్ తెలిపారు. అందరూ కరోనా నిబంధనలు పాటించాలని, కౌంటింగ్ ఏజెంట్ల కోసం పీపీఈ కిట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ యంత్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. అలాగే లాటరీ ద్వారా ఎంపికచేసిన ఐదు వీవీ ప్యాట్లలోని ఓట్ల స్లిప్పులను కూడా పరిశీలిస్తారు. ఒక్కో అభ్యర్థి పక్షాన టేబుల్కు ఒక్క ఏజెంట్ను మాత్రమే అనుమతిస్తున్నారు. నియోజకవర్గంలో 2,36,873 మంది ఓటర్లు ఉండగా 2,05,236 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కౌంటింగ్ జరుగుతున్న ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద 144 సెక్షన్ విధించారు. మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ప్రజలు గుమికూడవద్దని గోయల్ స్పష్టంచేశారు. విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదన్నారు. గెలిచిన వారితో ఇద్దరికి మాత్రమే రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు లోపలికి రావడానికి అనుమతి ఉంటుందని చెప్పారు. బయటకు వచ్చిన వీవీ ప్యాట్లు సాంకేతిక లోపంతో కూడుకున్నవని, పోలింగ్కు సబంధించినవి కాదని తెలిపారు. దీనిపై ఎలాంటి వదంతులను నమ్మవద్దని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిందన్నారు. షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ ఎమ్మెల్సీ ఎన్నికలను నిర్వహిస్తారని తెలిపారు.