నేడు ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్
న్యూఢిల్లీ: ఐపీఎల్ మెగా వేలానికి ముందు యువ ఆటగాళ్లు ప్రతిభ చాటుకునేందుకు చక్కటి వేదికగా ఉపకరించిన దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ తుది అంకానికి చేరింది. డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు, కర్ణాటక జట్ల మధ్య సోమవారం అరుణ్ జైట్లి స్టేడియంలో ఫైనల్ ఫైట్ జరుగనుంది. తొలి సెమీఫైనల్లో హైదరాబాద్పై విజయంతో తమిళనాడు జోష్లో ఉంటే.. రెండో సెమీస్లో విదర్భను ఓడించి కర్ణాటక తుదిపోరుకు అర్హత సాధించింది. మనీశ్ పాండే, కరుణ్ నాయర్, రోహన్ కదమ్, అభినవ్ మనోహర్, అనిరుధ్ జోషి రూపంలో కర్ణాటకకు బలమైన బ్యాటింగ్ లైనప్ అందుబాటులో ఉండగా.. సందీప్ వారియర్, మురుగన్ అశ్విన్, శరవణన్, సాయి కిషోర్తో కూడిన తమిళనాడు బౌలింగ్ దళం ఈ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నది. డిఫెండింగ్ చాంపియన్కు బ్యాటింగ్లో విజయ్ శంకర్, జగదీశన్, సాయి సుదర్శన్, హరి నిశాంత్ కీలకం కానున్నారు.