ఏలూరు జిల్లా : అమరావతి రైతులు చేపడుతున్న మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామాల్లోకి పాదయాత్ర చేరగానే పూలవర్షం కురిపిస్తూ తమ మద్దతు తెలుపుతున్నారు. రైతులకు దారిపొడవునా మహిళలు, యువత ఘనంగా స్వాగతిస్తున్నారు. పాదయాత్రలో ఉన్న రైతులను ఆత్మీయంగా పలకరిస్తూ వారికి తాగునీరు, మజ్జిగ అందిస్తున్నారు. కాగా, శనివారం పాదయాత్రకు రైతులు విరామం ప్రకటించారు. ద్వారకాతిరుమలలో విరామం తీసుకుంటున్న రైతులు చిన వెంకన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అమరావతి రైతుల మహాపాదయాత్ర శుక్రవారం ఏలూరు జిల్లాలో కొనసాగింది. దెందులూరు మండలం పెరుగుగూడెం నుంచి తిమ్మాపురం మీదుగా ద్వారకా తిరుమల వరకు పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రకు అడుగడుగునా ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తున్నదని రైతులు వాపోతున్నారు. కాగా, శనివారం పాదయాత్రకు విరామం ప్రకటించిన రైతులు.. ద్వారకాతిరుమలలో చిన్న వెంకన్నను దర్శించుకున్నారు. చిన వెంకన్న సన్నిధిలో మొక్కులు తీర్చుకునేందుకు ఈ రోజు వెసులుబాటు ఇచ్చారు. తమ పాదయాత్ర ముగిసేలోపుగా సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన తీర్పు రావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలో ఆలయ దక్షిణ రాజ గోపుర ప్రాంతం జై అమరావతి నినాదాలలో హోరెత్తింది.
ఇలా ఉండగా, శుక్రవారం దెందులూరు మండలం పెరుగుగూడెం నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమైన రైతుల మహా పాదయాత్ర 10 గంటలకు మెట్టపంగిడిగూడెం చేరింది. అక్కడ రైతులకు టీడీపీ నాయకులు సంఘీభావం పలుకుతూ ఘనంగా స్వాగతించారు. పంగిడిగూడెం, సూర్యచంద్రరావుపేట, గొల్లగూడెం, తిరుమలంపాలెం అడ్డరోడ్డు మీదుగా తిమ్మాపురం చేరింది. భోజన విరామం అనంతరం 3.30 గంటలకు బయల్దేరి ద్వారకా తిరుమల చేరింది. అక్కడ వైష్ణవి గెస్ట్హౌస్లో బసచేశారు.