న్యూఢిల్లీ : సాగుచట్టాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ ప్రారంభమైంది. కేంద్రం తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ప్రారంభించిన ఆందోళన కార్యక్రమాలు నాలుగు నెలలుగా చేరగా.. సంయుక్త కిసాన్ మోర్చా శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటల భారత్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ మేరకు రైతులు శుక్రవారం ఢిల్లీ-యూపీ సరిహద్దులో హాజీపూర్ రోడ్డుపై బైఠాయించారు. బంద్ సందర్భంగా రైలు, రోడ్డు రవాణా సేవలను నిలిపివేస్తామని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. దుకాణాలు, మార్కెట్లు, అన్ని సంస్థలు మూసివేయాలని, ప్రజలు సైతం రైతులకు అండగా నిలువాలని కోరారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో పాటు ఇతర అత్యవసర సేవలకు బంద్ నుంచి మినహాయింపునిచ్చారు. భారత్ బంద్కు కేంద్ర కార్మిక, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆప్, వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. బంద్ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
రైతులు తలపెట్టిన భారత్ ఏపీలో కొనసాగుతోంది. సాగుచట్టాలతో పాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వం సైతం మద్దతు తెలిపింది. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాలు ధర్నా నిర్వహించాయి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాఠశాలలకు యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు డిపోల పరిధిలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్టీసీ డిపోల వద్ద వామపక్షాలు నిరసన తెలిపాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాల ఆందోళన చేపట్టాయి. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న బంద్ కొనసాగుతోంది. బస్ డిపోల వద్ద పలు పార్టీల నాయకులు ఆందోళన నిర్వహించారు. విశాఖ జిల్లా మద్దిలపాలెం బస్టాండ్ వద్ద బంద్ నిర్వహిస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. వామపక్షాలు, ప్రజాసంఘాలు బంద్లో పాల్గొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ నేపథ్యంలో మధ్యాహ్నం వరకు బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత యథావిధిగా నడవనున్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.