స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోమారు చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్నది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం నామినేషన్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు అఫిడవిట్లో తప్పులు ఉన్నందున ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీనివాస్ నామినేషన్ చెల్లుబాటు కాదని ప్రకటించారు. దీంతో కవిత ఎన్నిక ఏకగ్రీవమైంది. 26వ తేదీన అధికారికంగా కవితకు ఈసీ విజయ పత్రాన్ని అందించనున్నది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత మండలిలో మరోసారి అడుగుపెట్టనున్నారు. కవిత గెలుపుపై ఉమ్మడి జిల్లాలో సంబురాలు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ కార్యకర్తలు పటాకులు కాలుస్తూ.. మిఠాయిలు పంచుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అత్యధికంగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. ఒకవేళ ఎన్నికలు జరిగినా.. విజయం ఏకపక్షమేనని గ్రహించిన ప్రతిపక్ష పార్టీలు ముందునుంచే పోటీకి ఆసక్తి చూపలేదు.
నిజామాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా ఊహించినట్లే జరిగింది. టీఆర్ఎస్ చారిత్ర క విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎలాంటి పో టీ లేకుండానే సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి స్థానిక సంస్థల కోటాలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీగా ఐదేండ్లు విశేష సేవలందించిన ఆమె… ఏడాది కాలంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా కొసాగుతున్నారు. తాజాగా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అత్యధికంగా అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు. రెండు జిల్లాల్లోనూ 90శాతం మంది గులాబీ పార్టీవారే. ఒక వేళ ఎన్నికలు జరిగినా.. విజయం ఏకపక్షమేనని ప్రతిపక్ష పార్టీలు గుర్తించా యి. కొద్దిమంది ఓటర్లను కలిగి ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసేందు కు కనీస ఆసక్తిని చూపించలేకపోయాయి. ఓటమికి బదులుగా పోటీ నుంచి తప్పుకుంటే మంచిదనే భావనతో నామినేషన్లు వేయలేదు. టీఆర్ఎస్ అభ్యర్థితో పాటు ఓ వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ పరిశీలనలో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో కవిత రెండోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ సమయం నవంబర్ 26, మధ్యాహ్నం 3గంటల తర్వాత ఏకగ్రీవమైన కవితకు ఈసీ నుంచి ధ్రువపత్రం అందజేయనున్నారు.
మూడు సార్లు పోరు.. రెండు సార్లు ఏకగ్రీవం…
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత స్థానిక సంస్థల కోటాలో వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుసగా టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగిస్తోంది. 2015 లో వచ్చిన ఎన్నికల్లో నాటి టీఆర్ఎస్ అభ్యర్థి భూపతి రెడ్డి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ అయ్యారు. తదనంతర పరిణామాలతో ఖాళీ అయిన స్థానంలో 2020, అక్టోబర్లో జరిగిన ఉప ఎన్నికలో కల్వకుంట్ల కవిత పోటీ చేసి భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు మూ డు సార్లు జరిగితే మూడు సార్లు గులాబీ జెండానే రెపరెపలాడింది. ఇందులో రెండు సార్లు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాన్ని అధికార పార్టీ కైవసం చేసుకోవడం విశేషం. 2014 ఎన్నికల్లో లోక్సభ సభ్యురాలిగా విజయం సాధించి నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు ప్రాతినిధ్యం వహించిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు శాసన మండలి సభ్యురాలి గా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు నేతృత్వం వహిస్తున్నారు.
అఫిడవిట్లో తప్పులు… నామినేషన్ తిరస్కరణ…
నామినేషన్ల దాఖలుకు చివరి రోజు టీఆర్ఎస్తో పాటుగా ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. దాఖలైన నామినేషన్లను బుధవారం ఎన్నికల అధికారులు పరిశీలించారు. ఇందులో స్వతంత్ర అభ్య ర్థి కోటగిరి శ్రీనివాస్ వేసిన నామినేషన్ను తిరస్కరిస్తున్నట్లుగా రిటర్నింగ్ అధికారి, నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ప్రకటించారు. ఫారం 26లోని అఫిడవిట్లో తప్పులు ఉన్నందున శ్రీనివాస్ నామినేషన్ చెల్లుబాటు కాదని ఆర్వో వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియ అంతా ఎన్నికల పరిశీలకురాలు అనితా రాజేంద్ర సమక్షంలో జరిగింది. టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు సరి గా ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ఎలాంటి పోటీ లేకపోవడంతో కవిత ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా కవిత ఎన్నికవ్వడం తో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు.
ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నది. ఉమ్మడి జిల్లా నియోజకవర్గానికి ఎవరూ పోటీలో లేకపోవడంతో పోలింగ్ నిర్వహణ తప్పింది. దీంతో పని ఒత్తిడి నుంచి యంత్రాంగానికి కాసింత ఉపశమనం కలిగినట్లు అయ్యింది. వాస్తవానికి ఎ మ్మెల్సీ ఎన్నికలు ఇతర ఎన్నికల విధానానికి పూ ర్తి విరుద్ధంగా ఉంటాయి. ప్రాధాన్యత క్రమంలో జరి గే పోలింగ్ ప్రక్రియను నిర్వహించడం కత్తిమీద సా ము లాంటిదే. మొత్తానికి ఎమ్మెల్సీ పోరు హడావుడి లేకుండానే నామినేషన్ల పరిశీలన తేదీ నాటికే ఏకగ్రీవంతో ముగింపు కార్డు పడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
మిన్నంటిన సంబురాలు..
ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు నిర్వహించారు. పటాకులు కాల్చి ఆనందం వ్యక్తం చేశా రు. సోషల్ మీడియాలోనూ కవిత అభిమానులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తు న పోస్టులు పెట్టారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా నివాసం లో రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, టీఆర్ఎస్ రా ష్ట్ర నాయకుడు రాంకిషన్ రావు సంతోషం వ్య క్తం చేశారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పటాకులు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. మంత్రి వేములకు ఎమ్మెల్యే బిగాల మిఠాయి తినిపించి అభినందించారు.
ఖలీల్వాడి/నిజామాబాద్ సిటీ, నవంబర్ 24: నగరంలోని ధర్నా చౌక్లో నాయకులు పటాకు లు కాల్చి సంబురాలు నిర్వహించారు. టీఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, నాయకు లు దండు శేఖర్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి నాయకులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ దాదన్నగారి విఠల్రావు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన చాంబర్లో టీఆర్ఎస్ నాయకులతో స్వీట్లు పంచుకొని సంబురాలు జరుపుకొన్నారు.
సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదు
నిజామాబాద్ సిటీ, నవంబర్ 24: స్థానిక సంస్థల ఎమ్మెల్సీలో భాగంగా స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో సంతకాల ఫోర్జరీపై రిటర్నింగ్ అధికారికి బుధవారం ఫిర్యాదులు అందాయి. తమ సంతకం ఫోర్జరీ చేశారని నందిపేట్ ఎంపీటీసీ(3) నవనీత, నిజామాబాద్ 31వ డివిజన్ కార్పొరేటర్ రజియా సుల్తానాతో పాటు కాంగ్రెస్ ఎంపీటీసీ మనోహర్ వేర్వేరుగా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. పరిశీలన అనంతరం అఫిడవిట్లో తప్పులు ఉండడంతో కోటగిరి శ్రీనివాస్ రావు నామినేషన్ను తిరస్కరించారు.