జడ్చర్ల, మార్చి 26 : దళితబంధు పథకంతో దళితులు బాగుపడాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని పాలమూరు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ పథకంతో దళితుల్లో సామాజిక మార్పు తీసుకొచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గానికి ఈ పథకంలో భాగంగా 100 యూనిట్లు మంజూరవగా.. ఉదండాపూర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న ఉదండాపూర్, వల్లూర్, ఖానాపూర్ గ్రామాలకు చెందిన దళితులకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారులతో శనివారం జడ్చర్లలోని చంద్రాగార్డెన్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముందుగా దళితబంధును అమలు చేస్తున్నట్లు చెప్పారు. తర్వాత విడుతల వారీగా పథకాన్ని అన్ని వర్గాలకు వర్తింపజేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు తర్వాత వారి జీవితాల్లో మార్పు చూస్తే దేశంలోని దళితులు ఇలాంటి కార్యక్రమం అమలు చేయాలని డిమాండ్ చేసే రోజులు వస్తాయన్నారు. అనంతరం పలువురితో ఎమ్మెల్యే ముచ్చటించారు. ప్రతిష్టాత్మకంగా దళితుబంధు అమలు చేస్తుంటే ఓట్ల కోసమే అని ప్రతిపక్షాలు విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకే యూనిట్కు కాకుండా లబ్ధి చేకూరే యూనిట్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రొడక్షన్, మ్యాన్ఫ్యాక్షరింగ్, ఫుడ్ప్రాసెసింగ్, ఇతర యూనిట్లను ఎంచుకోవాలన్నారు. 5 నుంచి 10 మంది కలిసి ఒక యూనిట్ పెట్టుకోవాలని కోరారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య, జెడ్పీ సీఈవో జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్యగౌడ్, సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ శివకుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, మండలాధ్యక్షుడు బాలసుందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, ఇండస్ట్రీయల్ అధికారి బాబురావు, తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో ఉమాదేవి, ఆర్ఐ సుదర్శన్రెడ్డి, ఎంపీవో జగదీశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మురళి, కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.