కోల్కతా : 2024 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేలా విపక్షాలతో సంప్రదింపులు జరుపుతామని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ పేర్కొన్నారు. విపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా మమతా బెనర్జీని ముందుకు తీసుకువస్తామని చెప్పారు. రానున్న రెండేండ్లలో విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చేందుకు టీఎంసీ నేతలు పనిచేస్తారని తెలిపారు.
దేశంలో మమతా బెనర్జీకి మంచి ఇమేజ్ ఉన్నదని, తమ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆమెను ప్రధాని అభ్యర్ధిగా కోరుకుంటున్నారని రాయ్ తెలిపారు. పశువుల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుబ్రత మొండల్ అరెస్ట్పై సౌగతా రాయ్ స్పందించారు. సరైన సమయంలో పార్టీ అవసరమైన చర్యలు చేపడుతుందని చెప్పారు. సమన్లకు స్పందించకపోవడంతోనే అనుబ్రత మొండల్ను అరెస్ట్ చేశారని అన్నారు.
సీబీఐ, ఈడీలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాయని, జార్ఖండ్ కేసులో ఎమ్మెల్యేలు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ పేరును వెల్లడించినా ఆయనను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. నారద కేసులో నిందితుడు సువేంధు అధికారిపై చర్యలు చేపట్టేలదని అన్నారు. దర్యాప్తు సంస్ధలు కేవలం విపక్ష నేతలనే ప్రశ్నిస్తూ అరెస్టులు చేస్తున్నాయని మండిపడ్డారు. టీఎంసీ నేత అనుబ్రత మొండల్ను గురువారం బీర్భంలోని ఆయన నివాసంలో సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.