వీణవంక : ఈటల రాజేందర్ గత్యంతరం లేక బీజేపీ నుంచి పోటీచేస్తున్నాడని, ఇదంతా పోలింగ్ వరకేనని ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన వీణవంక మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీని బొందపెట్టేది రాజేందరేనన్నారు.
పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ బీజేపీ డ్రామాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయన్నారు. ఈటల, రేవంత్రెడ్డితో సమావేశం అయ్యాడని వారే ఒప్పుకొన్నారన్నారు. ఈ విషయమై రాజేందర్ సమాధానం ఇవ్వాలని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఆమోదిస్తారా అని ప్రశ్నించారు.
ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో బండి సంజయ్, నిజామాబాద్లో అర్వింద్, హైదరాబాద్లో రాజాసింగ్ చేసిన డ్రామాలు ఈటల రానున్న వంద గంటల్లో హుజూరాబాద్లో ఎప్పుడైనా చేయవచ్చని, బండి సంజయ్ దర్శకత్వంలో ఈటల కొత్త సినిమా విడుదల కానున్నట్లు పేర్కొన్నారు.
ఈటల మంత్రిగా ఉండి ధర్మం వైపు అడుగులు వేయకుండా అధర్మం వైపు అడుగులు వేసి పార్టీని మోసం చేసింది నిజంకాదా అని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, బజరంగదళ్ నాయకులకు బీజేపీ వ్యతిరేకి అయిన రాజేందర్ తీరు కనిపించకపోవడం విడ్డూరమన్నారు. గెల్లు శ్రీనివాసును భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సింగిల్విండో మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ సర్పంచ్ జున్నూతుల జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.