ఉస్మానియా యూనివర్సిటీ : త్వరలో జరుగనున్న హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ను విద్యార్థి ఉద్యమ కారుడు, టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్కు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఉస్మానియా యూనివర్సిటీలో సంబురాలు మిన్నంటాయి.
టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో విద్యార్థులంతా బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుని, నృత్యాలు చేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి నేతలు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మొదటి నుంచి క్రియాశీలకంగా పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ ను గుర్తించి అవకాశం కల్పించడం గొప్పవిషయమని అన్నారు. కేసీఆర్ను చూసి మిగిలిన పార్టీల నాయకులు నేర్చుకోవాలని హితవు పలికారు.
మిగిలిన పార్టీల్లో ఎనభై ఏళ్లు దాటుతున్నా పదవులను పట్టుకుని వేలాడుతూ, యువతరానికి అవకాశం రాకుండా అడ్డుపడుతున్నారన్నారు.విద్యార్థి నాయకులు, యువకులు, ఉద్యమకారులకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారని కొనియాడారు. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లతో పాటు నామినేటెడ్ పదవులు సైతం ఇస్తూ యువతను ప్రోత్సహిస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికైనా మిగిలిన పార్టీలలో ఉన్న విద్యార్థి, యువజన నాయకులు కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు.
పార్టీలు, సిద్ధాంతాలు పక్కనపెట్టి ఓయూ పరిశోధక విద్యార్థి, స్నేహశీలి గెల్లు శ్రీనివాస్ గెలుపుకు కృషి చేయాలని కోరారు. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి విద్యార్థి నాయకుడిని గెలిపించుకుని విద్యార్థి శక్తిని ప్రపంచానికి చాటిచెప్పాలని విజ్ఞప్తి చేశారు.