న్యూఢిల్లీ : చైనా, పాకిస్తాన్లతో కొనసాగుతున్న సరిహద్దు ఉద్రిక్తల మధ్య రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రాఫెల్ యుద్ధ విమానాలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు రాబోయే నాలుగు రోజుల్లో భారత్కు రానున్నాయి. వీటి రాకతో భారత వైమానిక దళం మరింత పటిష్టం కానుంది. ఆ తర్వాత మరో తొమ్మిది యుద్ధ విమానాలు ఏప్రిల్ మధ్య నాటికి ఫ్రాన్ నుంచి నేరుగా భారత్కు చేరుకుంటాయని రక్షణ వర్గాలు తెలిపాయి. మూడు రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఇప్పటికే ఫ్రాన్స్ చేరుకుంది. ఫైటర్ జెట్లు ఈ నెల 30 లేదంటే 31న ఫ్రాన్స్ నేరుగా అంబాలా ఏర్బేస్కు చేరుకుంటాయి. భారత్ 2016 సెప్టెంబర్లో ఫ్రెంచ్ ప్రభుత్వంతో రూ.59వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ ఐదు యుద్ధ విమానాలను సరఫరా చేయగా.. గతేడాది జూలై 28న దేశానికి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 11 యద్ధ విమానాలు భారత్కు చేరగా.. వాటిని భారత వైమానిక దళం గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాఫెల్ యుద్ధ విమానాలను లడఖ్ సరిహద్దులో మోహరించారు.