ములుగు : ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటాపురం నూగూరు సీఐ శివప్రసాద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని వెంకటాపురం నూగూరు మండలం కొండపురం గ్రామ శివారులో బ్రిడ్జి వద్దపోలీసులు వాహనాలు తనికీ చేస్తుండగా.. ముగ్గురు మావోయిస్టు సానుభూతిపరులు పట్టుబడ్డారని తెలిపారు.
కొండపురం గ్రామానికి చెందిన తాటి సోమయ్య, తాటి సత్యం, యాలం సురేష్ మావోయిస్టు అగ్ర నాయకుల ప్రసంగాలకు ఆకర్షితులై గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీకి సానుభూతిపరులుగా వ్యవహరిస్తూ.. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులను అందిస్తున్నట్లు వివరాలను వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.