పెద్దపల్లి, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ) : సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ.. అబద్ధాలు మాట్లాడుతూ నీచమైన విమర్శలకు దిగితే నాలుక చీరేద్దామని, అందులో ఏ మాత్రం తగ్గేదే లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బంధంపల్లి స్వరూప గార్డెన్స్లో ఆదివారం టీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ బాధ్యతల స్వీకరణ, పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, పార్టీ టీఆర్ఎస్ అని పేర్కొన్నారు. అత్యధికంగా 70లక్షల మంది సభ్యులను కలిగిన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టంచేశారు.
అవకాశం వస్తే దేశానికే ప్రధానిగా నాయకత్వం వహించే సత్తా ఉన్న నేత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేస్తే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అసత్యాలను ప్రచారం చేస్తూ.. నీచమైన ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
‘బిడ్డా.. ఇలాంటి మాటలు మాట్లాడితే గ్రామాల్లో తిరగనివ్వబో’మని ఆయన హెచ్చరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కడా, ఎవరికీ భయపడేది లేదని, టీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన ప్రజా శక్తిగా ఎదిగిందన్నారు. ఎనిమిదేళ్లు దేశానికి నాయకత్వం వహిస్తున్న బీజేపీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన తెలంగాణకు చేసిందేమిటో ప్రజలకు తేల్చిచెప్పాలన్నారు.
కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, మండలి విప్ టీ. భానుప్రసాదరావు, జడ్పీ చైర్పర్సన్ పుట్ట మధకర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి, శాసన మండలి సభ్యులు ఎల్. రమణ, కే. వెంకట్రావ్ పాల్గొన్నారు.