బ్యాంకాక్: భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కీలక అంకానికి సమయం ఆసన్నమైంది. ఏడు దశాబ్దాల తర్వాత ప్రతిష్ఠాత్మక థామస్కప్లో ఫైనల్ పోరుకు తొలిసారి దూసుకొచ్చిన భారత్ కొత్త చరిత్ర లిఖించాలన్న పట్టుదలతో ఉంది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో రికార్డు స్థాయిలో 14సార్లు చాంపియన్ ఇండోనేషియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్ చేరే క్రమంలో మలేషియా, డెన్మార్క్పై అద్భుత విజయాలు సొంతం చేసుకున్న భారత బృందం మరోమారు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తున్నది. ముఖ్యంగా సీనియర్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్ భారమంతా నెలకొని ఉంది. గత రెండు మ్యాచ్ల్లో జట్టుకు అద్భుత విజయాలు అందించడంలో వీరిద్దరు కీలకంగా వ్యవహరించారు. ఇదే స్ఫూర్తిదాయక ప్రదర్శన చేస్తే..భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయం లిఖించినట్లే అవుతుంది.