హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది తెలంగాణలో నిరుద్యోగుల కలలు పండబోతున్నాయని పంచాంగశ్రవణకర్త బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరాన్ని ‘ఉద్యోగ నామ సంవత్సరం’గా అభివర్ణించారు. ఉగాది పండుగ సందర్భంగా శనివారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. వచ్చే ఏడాది కాలంలో తెలంగాణ భవిష్యత్తును కండ్ల ముందుంచారు. ఈ ఏడాది శుభకృత్ నామ సంవత్సరం.. ఈ జగతికి కావాల్సిన ఆనందాలను, ఐశ్వర్యాలను అందిస్తుందని, అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానాన్ని నింపుతుందని, ప్రజలు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ ఏడాది శివుడి రూపమైన అగ్ని అధిదేవతగా ఉన్నారని, కాబట్టి వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ప్రభ మళ్లీ వెలగబోతున్నదని, ఏడాదంతా ఉత్సవాలతో నడుస్తుందని చెప్పారు. యజ్ఞయాగాది క్రతువులు పెద్ద మొత్తంలో జరుగుతాయని చెప్పారు.
అద్భుత పరిపాలన
ఈసారి శని దేవుడు నాయక స్థానంలో ఉన్నాడని, కాబట్టి పరిపాలన అద్భుతంగా ఉండబోతున్నదని సంతోష్కుమార్ శాస్త్రి చెప్పారు. రాజకీయంగా చాలామార్పులు జరుగుతాయని అన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలు వెలువడుతాయని, దేశం మొత్తం తెలంగాణవైపు తిరిగి చూస్తుందని తెలిపారు. పార్టీలు మారేవారికి గడ్డుకాలం తప్పదని హెచ్చరించారు. మంది, మార్బలం, వాగ్ధాటి కలిగిన వ్యక్తులకు ఈ ఏడాది అద్భుతంగా సాగుతుందని చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ చక్రం ప్రకారం.. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పాలన సాగుతుందన్నారు. రాశి ఫలాల ప్రకారం సీఎం కేసీఆర్కు ప్రతికూల సమయం ఈ ఫిబ్రవరి 27తో అయిపోందని చెప్పారు. శుభకృత్ నామ సంవత్సరంలో సీఎంకు చాలా బాగుంటుందని అన్నారు. ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా ఆయనకు ఏమీ కాదన్నారు. ఈ ఏడాది ఆయన విశ్వరూపం చూపించబోతున్నారని తెలిపారు.
విశేషంగా వర్షాలు.. విస్తారంగా పంటలు
ధాన్యాధిపతి స్థానంలో శుక్రుడు ఉన్నాడని, దీనిని బట్టి ఈ ఏడాది పంటలు అద్భుతంగా పండుతాయని శాస్త్రి చెప్పారు. ఈ ఏడాది సైతం వానలు విశేషంగా కురుస్తాయన్నారు. వరి, జొన్న, గోధుమలు, శనగలు, వేరుశనగలు వంటివాటికి మంచి కాలం ఉన్నదని, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, పప్పుధాన్యాలకు కొంత ఇబ్బంది కలుగొచ్చన్నారు. జూన్ 30 నుంచి జూలై 28 వరకు మంచి వర్షాలు పడుతాయని, ప్రభుత్వ సలహాలు పాటిస్తూ పంటలు వేసే రైతులు డబ్బు సంచులతో ఇంటికి వెళ్తారని చెప్పారు. అక్టోబర్లో (ఆశ్వయుజ మాసం) తుఫానులు వచ్చే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు.
మాస్కులకు సెలవు..
ఈ ఏడాది ప్రజారోగ్యం భేషుగ్గా ఉంటుందని, కరోనా వంటి విపత్తులు ఉండబోవని శర్మ స్పష్టంచేశారు. ‘పంచాగం ప్రకారం మాస్కులకు సెలవు’ అని ప్రకటించారు. విద్యారంగం బాగుంటుందని, కొత్త విద్యావిధానాలు, సంస్కరణల దిశగా ప్రభుత్వాలు ఆలోచిస్తాయని తెలిపారు. సాఫ్ట్వేర్లో వర్క్ ఫ్రమ్ హోం బంద్ అవుతుందని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగొచ్చని చెప్పారు. ఏప్రిల్-మే నెలల్లో ముఖ్యనేతలకు, అధికారుల భద్రత విషయంలో జాగ్రత్త పాటించాలని హెచ్చరించారు. దేశంలో చిన్నపాటి అలజడులు జరుగొచ్చని అన్నారు.
దేశ అత్యున్నత పదవి మహిళకు?
మహిళలు ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధిస్తారని చెప్పారు. దేశంలోనే అత్యున్నత పదవి మహిళకు దక్కొచ్చని అన్నారు. తెలంగాణలోనూ కీలక పదవులు దక్కుతాయని చెప్పారు. ముఖ్యంగా మహిళా ఐఏఎస్ అధికారులకు మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో అద్భుతంగా ఉంటుందని, మిగతా చోట్ల కాస్త ఇబ్బంది తప్పదని చెప్పారు. హైదరాబాద్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతుందన్నారు. మీడియాకు కడుపు నిండుగా వార్తలు ఉంటాయని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో రైలు ప్రమాదాలు జరుగొచ్చని, గుజరాత్, రాజస్థాన్లో ప్రకృతి విపత్తులు, మహారాష్ట్రలో అగ్ని ప్రమాదాలు సంభవించవచ్చని అంచనా వేశారు. అయితే తెలంగాణకు ఎలాంటి భయం లేదన్నారు. ప్రజలు ఇష్టారీతిన ఖర్చు పెట్టొద్దని, పొదుపు పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.