న్యూఢిల్లీ, జనవరి 19: కరోనా మూడో వేవ్ రెండు మూడు వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని ఎస్బీఐ అంచనా వేసింది. ముంబైలో కేసులు తగ్గుతున్నా బెంగళూరు, పుణెలాంటి నగరాల్లో పెరుగుతున్నట్టు తన పరిశోధన నివేదికలో పేర్కొన్నది. ముంబైలో కేసులు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకొన్నాయని వివరించింది. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తే దేశవ్యాప్తంగా మరో 2-3 వారాల్లో మూడో వేవ్ గరిష్ఠ స్థాయికి చేరవచ్చని తెలిపింది. ముంబైలో మరణాలు 60-69 ఏండ్ల వారిలోనే ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. మరోవైపు, మూడో వేవ్ ఈ నెల 23తో(ఆదివారం) పీక్ స్టేజీకి చేరుతుందని ఐఐటీ కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. రోజువారీ కేసులు 4 లక్షల కంటే దిగువనే ఉంటాయన్నారు. ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కేసులు ఇప్పటికే గరిష్ఠానికి చేరాయని ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ అన్నారు.
3 లక్షల చేరువలో కొత్త కేసులు
దేశవ్యాప్తంగా మంగళవారం 2,82,970 కొత్త కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 18,31,000కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య ఇంత పెరుగడం గత 232 రోజుల్లో ఇదే తొలిసారి. మరోవైపు కరోనా బారిన పడిన వారిలో తాజాగా 441 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,87,202కి చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 15.13గా నమోదైంది.
వచ్చే నెల 28 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం
అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని వచ్చే నెల 28 వరకు పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఇది సరుకు రవాణా విమానాలకు వర్తించదని పేర్కొంది.