మహబూబాబాద్ : పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు మూడోస్థానం తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ (MLC Satyavati Rathode) అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం చెందడంతో మహబూబాబాద్లో నిర్వహించిన ఆయన సభలకు జనాలు రాలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) కు ఓటమి తప్పదని పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించనున్నారని ధీమాను వ్యక్తం చేశారు.
నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) జిల్లా అభివృద్ధికి అనేక నిధులు ఇచ్చారని వెల్లడించారు. బీఆర్ఎస్ (BRS) హయాంలో మొదలుపెట్టిన ఇంజినీరింగ్ కాలేజితో పాటు ఇతర అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మె ల్యే మురళీనాయక్, ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ జిల్లాకు నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు.
23న మాలోత్ కవిత నామినేషన్
ఈనెల 23న మహబూబాబాద్ (Mahabubabad) ఎంపీ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా మాలోత్ కవిత నామినేషన్ (Nominations) వేయనున్నారని ఎమ్మెల్సీ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జడ్పీ చైర్మన్ అంగోత్ బిందూ, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ మార్నెని వెంకన్న పాల్గొన్నారు.