న్యూఢిల్లీ, మార్చి 5: కార్లు, టూవీలర్ల ఇన్సూరెన్స్ వ్యయాలు పెరగనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వివిధ రకాల వాహనాలకు థర్డ్పార్టీ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియం పెంచాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. కొవిడ్-19 పాండమిక్ నేపథ్యంలో రెండేండ్ల మారిటోరియం అనంతరం సవరించిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం రేట్లు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని సమాచారం. గతంలో ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ టీడీ రేట్లను నోటీఫై చేసేది. తొలిసారిగా ఐఆర్డీఏఐతో సంప్రదించిన మీదట తొలిసారిగా రోడ్డు రవాణా శాఖ ఈ దఫా నోటీఫై చేయనుంది. ముసాయిదా నోటీఫికేషన్ ప్రకారం ఎలక్ట్రిక్ ప్రైవేట్ కార్లు, ఎలక్ట్రిక్ టూవీలర్లు, ఎలక్ట్రిక్ రవాణా వాణిజ్య వాహనాలు, ప్రయాణీకుల్ని చేరవేసే ఎలక్ట్రిక్ వాహనాలకు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 15 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వాహనానికి స్వంతంగా చేసుకునే డ్యామేజి మినహా మిగతా డ్యామేజీలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కవర్ లభిస్తుంది. దీనిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. స్వంత డ్యామేజీ కవర్ కోసం వాహన యజమానే బీమా సాధనాన్ని కొనుగోలు చేసుకోవాలి. ముసాయిదా నోటిఫికేషన్పై మార్చి 14లోగా ప్రభావిత వ్యక్తుల సూచనల్ని మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది.
సవరించిన ప్రీమియం రేట్లు (రూ.లలో)
వాహనం 2022-23 2019-20
కార్లు
1,000 సీసీ 2,094 2,072
1.000-1.500 సీసీ 3,416 3,221
1,500 సీసీ పైబడి 7,897 7,890
టూవీలర్
150 సీసీ-350 సీసీ 1,366 —
350 సీసీ పైబడి 1,804 —