మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 5 : ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసే బాధ్యతలను పంచాయతీలు చేపట్టనున్నాయి. వసతులు సమకూర్చడంతో పాటు అవసరమైన వాటికి మరమ్మతు చేసి బడులను బలోపేతం చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పంచాయతీలకు ఏటా విడుదలయ్యే ఆర్థిక సంఘం నిధుల్లో కొంతభాగం వెచ్చించనున్నారు. ఈ మేరకు 14, 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుకు ఉపయోగించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ప్రభుత్వం నుంచి అందించే నిధులపై పాఠశాలల అభివృద్ధి ఆధారపడేది. తాజా ప్రభుత్వ నిర్ణయంతో స్థానికంగా పంచాయతీలు ఆర్థిక సంఘం నిధులతో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
నాడు పారిశుధ్యం.. నేడు నిధులు
కరోనా నేపథ్యంలో మూత పడిన ప్రభుత్వం పాఠశాలలను తిరిగి ప్రారంభించినప్పుడు పారిశుధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. తాజాగా పాఠశాలల అభివృద్ధికి నిధులు ఆర్థిక సంఘం నుంచి కొంత వెచ్చించే బాధ్యతను అప్పగించడంతో పాఠశాలలకు మేలు జరగనున్నది.
జిల్లాలో 924 ప్రభుత్వ పాఠశాలలు
మెదక్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 924 ఉన్నాయి. జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉండగా, 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ పరిధిల్లోనే ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఎక్కువగా ఉంది.ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశాలు పెద్ద సంఖ్యలో పెరిగింది.
ఆదేశాలు వచ్చాయి..
ప్రభుత్వ పాఠశాలలను పం చాయతీలు అభివృద్ధి చేసేలా ఇచ్చిన ఆదేశాలు వచ్చాయి. పా ఠశాలల్లో ఏమైనా సమస్యలుంటే పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లాలి. ప్రధానోపాధ్యాయులు ఎంపీడీవోల దృష్టికి సైతం తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి.
-తరుణ్కుమార్, పంచాయతీ అధికారి, మెదక్