నాగర్కర్నూల్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఎన్నారైలు భాగస్వాములు కావాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
‘మన ఊరు- మన బడి’ ‘మన బస్తీ- మన బడి’ కార్యక్రమంపై బుధవారం నాగర్కర్నూల్ పట్టణంలోని సాయి గార్డెన్ లో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీడీవోలు, ఎంఈఓలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు.
తెలంగాణ ఏర్పాటుపై అనేక అనుమానాలు వ్యక్తంచేసిన పరిస్థితి నుంచి దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా రూపాంతరం చెందామన్నారు. భారీ ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయం, సంక్షేమం వంటి రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందన్నారు.
విద్యా రంగంలో అనేక మార్పులు తీసుకువచ్చామని, ప్రాథమిక పాఠశాల నుంచి మొదలుకొని మహిళలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీల వరకు నూతనంగా వందలాది విద్యాసంస్థలను ఏర్పాటు చేశామని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలోని సర్కారును బడులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ మన బస్తీ మనబడి కార్యక్రమం చేపట్టిందని వెల్లడించారు.
ఈ కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ స్థాయి బడుల్లో చదువుకొని ఇతర దేశాలకు వెళ్లి అభివృద్ధి చెందిన పూర్వ విద్యార్థుల భాగస్వామ్యాన్ని అందించేలా క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేలా పాఠశాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాని విజయవంతం చేసేలా ప్రతి ఒక్కరూ సమాజానికి అవసరమైన 100% అక్షరాస్యత అందించే విధంగా కృషి చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
గ్రామ సర్పంచులు విద్యా కమిటీ చైర్మన్ లకు ప్రభుత్వం ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు, జీవోను తెలుగులో అనువాదం చేసి అందించాలని డీఈఓ ను ఆదేశించారు.
శిథిల వ్యవస్థలో ఉన్న పాఠశాలల తొలగింపు అనుమతుల్లో జాప్యం లేకుండా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఉత్తర్వులు అందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ను ఆదేశించారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి,జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అదనపు కలెక్టర్లు మను చౌదరి, రాజేష్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.