(స్పెషల్ టాస్క్ బ్యూరో) న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఐదు రోజులపాటు ఇరాన్పై దాడులను నిలిపేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటికీ, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇరాన్పై ఇజ్రాయెల్ ఒంటరి పోరును కొనసాగిస్తుందా? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపించాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ అధికారులు.. అవసరమైతే ఇరాన్తో ఒంటరిగానైనా పోరాడుతామని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా దీన్ని ధ్రువపర్చేలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ‘మా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్, లెబనాన్పై దాడులను మరింత ఉద్ధృతం చేస్తాం’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్పై యుద్ధానికి ట్రంప్ తాత్కాలికంగా బ్రేకులు వేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేయడం గమనార్హం.