బీజేపీ నాయకులు అధికార కాంక్షకు తోడు రోజురోజుకూ ఉనికి కోల్పోతున్నామనే భయంతో ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నరు. ఏదో ఒకటి చేసి క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నరు. మా కార్యకర్తలపై కర్రలు, కత్తులతో దాడులు చేస్తరా? తుపాకులతో బెదిరిస్తరా? ఇది యూపీ, బిహార్ కాదు.. అక్కడి బుల్డోజర్ల సంస్కృతి ఇక్కడ అమలు చేస్తామంటే నడువదు. తిప్పికొడతం. పిడికెడు మంది ఉన్న మీరే అంతలా రెచ్చిపోతే.. లక్షల మంది కార్యకర్తల బలం ఉన్న మేం ప్రతిఘటిస్తే పరిస్థితి ఎట్లుంటదో అర్థం చేసుకోవాలి. బీసీ బిడ్డ, టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యపై బీజేపీ గుండాల దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
– మంత్రి గంగుల కమలాకర్
ఎల్లారెడ్డిపేట, మార్చి 19: బీజేపీ నాయకులు ఉనికి కోల్పోతున్నామనే భయంతో ఇష్టారాజ్యంగా ప్రవరిస్తున్నారని, ఏదో ఒకటి చేసి క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఫైరయ్యారు. ఎక్కడో బిహార్, యూపీ తరహాలో కర్రలు, కత్తులు, తుపాకులతో దాడులకు యత్నిస్తున్నారని, బుల్డోజర్లతో తొక్కిస్తామంటే ఇక్కడ నడువదని హెచ్చరించారు. తమది కేవలం అభివృద్ధి, సంక్షేమ ఎజెండా అని, బీజేపీ వాళ్లు విధ్వంస ఎజెండాతో ముందుకు పోతున్నారని ధ్వజమెత్తారు. బీసీ బిడ్డ టీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యపై బీజేపీ గూండాల దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దాడి యత్నం విషయం తెలుసుకుని శనివారం ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్తో కలిసి ఎల్లారెడ్డిపేటకు వెళ్లి ఆగయ్యను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పదిరకు చెందిన ఓ బీజేపీ కార్యకర్త సీఎంపై అసభ్య పదజాలంతో పోస్టు చేశాడని, దానిపై గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కౌంటర్ ఇచ్చాడని, దీంతో మరో బీజేపీ కార్యకర్త కల్పించుకొని సదరు టీఆర్ఎస్ కార్యక్తర్త కుటుంబ సభ్యులపై అసభ్యపదజాలంతో పోస్టులు పెట్టి రెచ్చగొట్టాడని వివరించారు. ఈ క్రమంలో ఆ మెసేజ్లపై టీఆర్ఎస్ కార్యకర్త ఠాణాలో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నిస్తున్న టైంలో తమ కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రయత్నించిన తరుణంలో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైందని చెప్పారు. అదే సమయంలో పోలీసులు కల్పించుకుని టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించివేశారని చెప్పారు. అనంతరం బీజేపీకి చెందిన రెడ్డబోయిన గోపి తుపాకీని పట్టుకుని కార్యకర్తలను రెచ్చగొట్టి రాళ్లు, కర్రలతో తోట ఆగయ్యపై దాడి చేసి, చంపేందుకు ప్రయత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సోషల్మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు చేసిన వారిపై, దాడిలో పాల్గొన్నవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, గన్తో భయపెట్టేలా వ్యవహరించిన వారి లైసెన్సు రద్దు చేయాలని డీజీపీని కోరారు. దాడి చేసిన, టీఆర్ఎస్ నాయకుల కార్ల అద్దాలు ధ్వంసం చేసిన, ఆగయ్యపై దాడికి యత్నించిన వారిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, లేదంటే వారి పార్టీ ఎజెండా దాడుల ఎజెండాగా చెప్పదలుచుకున్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు. ఇక్కడ నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ఎంపీపీలు పిల్లి రేణుక, పడిగెల మానస, జడ్పీటీసీలు చీటి లక్ష్మణ్రావు, కొమిరిశెట్టి విజయ, ముస్తాబాద్ రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్రావు, సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్యపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. రాష్ట్రంలో హింస, ద్వేషాలను బీజేపీ రెచ్చగొట్టే విధంగా చేస్తున్న విధానాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి పార్టీలకు తావులేదు. అరాచకంగా వ్యవహరించి కారును ధ్వంసం చేయడమే కాకుండా తోట ఆగయ్యపై దాడి చేసిన బీజేపీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
– చెన్నమనేని రమేశ్బాబు, ఎమ్మెల్యే వేములవాడ