వరంగల్/హనుమకొండ చౌరస్తా, జనవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాజకీయ అభద్రత ఉన్న వారి కారణంగా దేశంలో ప్రశ్నించే పరిస్థితులు లేకుండా పోయాయని ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్ మల్లిక సారాభాయ్ ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రస్తుతం దేశంలో పాలన సాగుతున్నదని మండిపడ్డారు. రామప్ప ఆలయంలో ఆమె నృత్య ప్రదర్శనకు కేంద్రం అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బీవీ పాపారావుతో కలిసి శనివారం హనుమకొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘భారత్ ప్రజాస్వామ్య దేశం. 80 శాతం మంది హిందువులు ఉన్న దేశం. ప్రశ్నించడం మా డీఎన్లోనే ఉన్నది. అందుకే ప్రశ్నలు కొనసాగుతుంటాయి. రామప్పకు యునెస్కో కట్టడంగా గుర్తింపు వచ్చిన తర్వాత మొదటిసారి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయాలని అనుకున్నా.
రాజకీయంగా అభద్రతలో ఉన్న వారి కారణంగా రామప్ప ఆలయం వద్ద నా నృత్య ప్రదర్శనకు అనుమతి రాలేదు’ అని మల్లిక సారాభాయ్ తెలిపారు. భావ వైరుధ్యం, కళ వేర్వేరని, రెండింటినీ కలిపి చూసి నిర్ణయాలు తీసుకోవడం సరికాదని ఆమె కేంద్రానికి చురకలంటించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన ప్రదర్శనలు కొనసాగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. రామప్ప ఆలయ ఆవరణలో ప్రదర్శన రైద్దెన వెంటనే వరంగల్ నగరంలో దీన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇందుకు సహకరించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్కు కృతజ్ఞతలు తెలిపారు. 2002లో ఓ వర్గంపై జరిగిన దాడులను తాను వ్యతిరేకించానని, అప్పటినుంచి ఇప్పటి పాలకులతో ఒక అంతరం కొనసాగుతున్నదని పేర్కొన్నారు. గుజరాత్లోని ఆ పరిస్థితులకు పోలీసులు, ప్రభుత్వం..మొత్తంగా అప్పటి సీఎం నరేంద్రమోదీ బాధ్యుడని తాను చెప్పానని, దీనిపై సుప్రీంకోర్టుకు కూడా వెళ్లానని గుర్తు చేశారు.
ఆకట్టుకున్న నృత్యప్రదర్శన
రామప్ప ఫెస్టివల్లో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని కుడా గ్రౌండ్లో శనివారం రాత్రి కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లిక సారాభాయ్ నృత్యప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నది. 70 ఏండ్ల వయస్సులోనూ మల్లిక సారాభాయ్ తన బృందంతో కలిసి 70 నిమిషాలపాటు నృత్యప్రదర్శన ఇచ్చి అదరహో అనిపించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్-రేవతి దంపతులు, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, కలెక్టర్లు రాజీవ్గాంధీ హనుమంతు, గోపి, పోలీస్ కమిషనర్ రంగనాథ్, ములుగు ఎస్పీ సంగ్రామ్సింగ్ పాటిల్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పాపారావు పాల్గొని వీక్షించారు.