సిద్దిపేట అర్బన్ : రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల సమస్యతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై గత నెల 25వ తేదీన జరిగిన సమావేశంలో నేను మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి తప్పుదోవ పట్టించారని జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయించే దుకాణాలు సీజ్ చేసి కేసులు సైతం నమోదు చేశామని వివరించారు. నకిలీ విత్తనాలు అమ్మడం వల్ల రైతుల భూములు ధ్వంసమై తీరని నష్టం వాటిల్లుతుందని.. ఈ విషయాన్ని విత్తనాలు అమ్మే డీలర్లకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డీలర్ల లైసెన్స్లు రద్దు చేస్తామని అన్నానని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో డీలర్ల లైసెన్స్ల రద్దుకు వ్యతిరేకంగా న్యాయస్థానాల ముందు వాస్తవాలను తొక్కిపెట్టి కేసులు వేశారని తెలిపారు. వేసవిలో సిద్దిపేట జిల్లాలో అధిక ఉష్టోగ్రత వద్ద వరిని పండించవద్దని, ప్రత్యామ్నయ పంటలను వేసుకోవాలని రైతులకు సూచించామని వెల్లడించారు. న్యాయస్థానాలకు వ్యతిరేకంగా తాను ప్రకటనలు చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయని, కానీ డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని మాత్రమే మాట్లాడానన్నారు. న్యాయస్థానాలకు కించపరిచే పదాలను తాను వాడలేదన్నారు.
తాను ఒక బాధ్యతాయుతమైన అధికారినని, తాను అనేక సార్లు కోర్టు తీర్పులను గౌరవించానన్నారు. ఏనాడు కూడా న్యాయస్థానాలను అగౌర పరచలేదన్నారు. ప్రజా ప్రయోజనాల కోసమే మాత్రమే పని చేశానని, కొందరు కావాలనే తన ప్రకటలను తప్పుగా వక్రీకరించారని తెలిపారు. ఈ విషయమై కోర్టులో రిట్ పిటీషన్ కూడా దాఖలు చేసినట్లు తెలిపారు. తనను చెడుగా చూపించేందుకు కొన్ని పత్రికలు ప్రయత్నిస్తున్నాయని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి పేర్కొన్నారు.