ఉమ్మడి జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన
ప్రక్రియ సజావుగా సాగింది. బుధవారం మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకుడు శ్రీధర్, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. మొత్తం 10 నామినేషన్లు దాఖలు కాగా అందులో ఆరింటిని వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. ఒకరు నామినేషన్ ఉపసంహరించుకోగా.. బరిలో ముగ్గురు మిగిలారు. వీరిలో టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఫరూక్నగర్ మండలానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి కావలి శ్రీశైలం ఉన్నారు.
మహబూబ్నగర్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బుధవారం జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఆరుగురిని అనర్హులుగా ప్రకటించారు. బుధవారం మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు ఈ.శ్రీధర్, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి ఏజెంట్లు, ప్రతిపాదకుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావు ఎన్నికలకు దాఖలైన నామినేషన్లను పరిశీలించారు. ఉమ్మడి జిల్లా నుంచి రెండు పదవుల ఎన్నికకుగానూ మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీటిలో 4 నామినేషన్లు ఆమోదించగా, మిగిలిన ఆరు నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి వెంకట్రావు తెలిపారు.
రెండు స్థానాలు .. ముగ్గురు అభ్యర్థులు..
ఆమోదించిన నామినేషన్లలో టీఆర్ఎస్ నుంచి కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ఫరూక్నగర్ మండలానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి కావలి శ్రీశైలం, నాగర్కర్నూల్ జిల్లా కోడేరు మండలం కొండ్రావుపల్లికి చెందిన మరో ఇండిపెండెంట్ అభ్యర్థి సుధాకర్రెడ్డి నామినేషన్లు ఆమోదం పొందాయి. కాగా, సుధాకర్రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు.
ఆరుగురి నామినేషన్లు తిరస్కరణ..
స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సారబాయి కృష్ణ, షేక్ రహీం పాషా, మహమ్మద్గౌస్, సంద రేణుక, బెజ్జం మల్లికార్జునరావు, మంతటి రామాంజనేయులు నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు.
పకడ్బందీగా నామినేషన్ల పరిశీలన..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు దాఖలైన నామినేషన్ల పరిశీలన పకడ్బందీగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన అన్ని జిల్లాల అధికారులు హాజరయ్యారు. మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, నాగర్కర్నూల్ అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, చంద్రారెడ్డి, డీ.వేణుగోపాల్, రఘురామశర్మ, శ్రీనివాస్రెడ్డి, షాద్నగర్, మహబూబ్నగర్ ఆర్డీవోలు రాజేశ్వరి, పద్మశ్రీ, నాగర్కర్నూల్ ఇన్చార్జి జెడ్పీ సీఈవో భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రేపటి వరకు ఉపసంహరణలు..
నామినేషన్ల ఉపసంహరణ కోసం 26వ తేదీ వరకు అవకాశం ఉన్నది. రెండు స్థానాల కోసం అధికార పార్టీ నుంచి ఇద్దరు, ఒక ఇండిపెండెం ట్ అభ్యర్థి పోటీలో ఉన్నారు. స్థానిక సంస్థలకు విధులు, నిధులు కేటాయించాలని కోరుతూ నా మినేషన్ వేసినట్లు ఇండిపెండెంట్ శ్రీశైలం తెలిపారు. మరో రెండ్రోజులు అవకాశం ఉన్నందున స్వతంత్ర అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటే ఏకగ్రీవమయ్యే అవకాశం లేకపోలేదు.