గద్వాల, డిసెంబర్ 9 : దేశంలో రైతులను మించిన శాస్త్రవేత్తలు మరెవరూ లేరని సినీనటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉన్న స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవన్లో అఖిలపక్షం నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ సర్కారు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తే రైతులకు 50 శాతం లాభాలు వస్తాయని తెలిపారు. కర్షకుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. అయితే నేడు అమలు కావడం లేదని ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, తీరా గెలిచాక ఊసెత్తడం లేదని దుయ్యబట్టారు. రైతులకు నష్టం కలిగించేలా.. కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడేలా మూడు చట్టాలను తీసుకురాగా.. అన్నదాతల పోరాట ఫలితంగా వాటిని రద్దు చేసిందని చెప్పారు. అలాగే విద్యుత్ చట్టం కూడా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులపై కేంద్రానికి గౌరవం ఉంటే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తేయాలన్నారు. అలాగే మృతి చెందిన కర్షకుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. రెండేండ్ల ముందుగానే వరి సాగు చేయొద్దని ప్రకటించి ఉంటే నేడు రైతులు ఇతర పంటల వైపు మొగ్గు చూపేవారన్నారు. కానీ ఇప్పుడు వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. విద్యా, వైద్యం, వ్యవసాయం ప్రైవేటు పరం చేయొద్దన్నారు. మోడీ సర్కారు రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన దేశాల జాబితాలో ప్రపంచంలోనే భారత్ 102వ స్థానంలో ఉన్నదన్నారు. అంబేద్కర్ ప్రతిపాదించిన ధరల నియంత్రణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగలా చేశారని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలతో కలిగే నష్టాలపైనే తాను రైతన్న సినిమా చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. 11న గద్వాలతోపాటు నారాయణపేట, కొత్తకోట తదితర ప్రాంతాల్లో సినిమా విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం నారాయణమూర్తిని పలువురు సన్మానించారు. సమావేశంలో అఖిలపక్షం నాయకులు ఆలూరి ప్రకాశ్గౌడ్, మధుసూదన్బాబు, వెంకటస్వామి, నర్సింహ, గోపాల్ యాదవ్, రాజు, ప్రభాకర్, ఇక్బాల్పాషా, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.