హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): పల్లె దవాఖానలతో గ్రామీణులకు నాణ్యమైన వైద్యం చేరువ కానున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ప్రాథమిక దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స అందించటంలో ఈ దవాఖానలు కీలకపాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. శ్రీ షిర్డీసాయి జనమంగళం ట్రస్ట్ అధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురంలో ఏర్పాటుచేస్తున్న 250 పడకల మల్టీ స్పెషాలిటీ దవాఖాన ప్రాజెక్టు ఆవిషరణ కార్యక్రమం హైదరాబాద్లోని ద పార్క్ హోటల్లో ఆదివారం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వైద్యరంగాన్ని పటిష్ఠం చేశామని తెలిపారు. ఏడేండ్ల క్రితం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, నేడు వాటిని 17కు పెంచామని చెప్పారు. ఎంబీబీఎస్ సీట్లను 2,875కు, పీజీ వైద్య సీట్లను 1,200 వరకు పెంచుకొంటున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల సంఖ్య పెంచాలన్న ఉద్దేశంతోనే వైద్యవిద్య సౌకర్యాలు పెంచుతున్నామని తెలిపారు. గ్రామాల్లో 4 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. వీటిద్వారా ఎంబీబీఎస్ వైద్యుల సేవలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతా ల్లో వైద్యసేవలు అందించేవారికి పీజీ అడ్మిషన్లలో ప్రత్యేక కోటా కల్పించామని తెలిపారు.
మానవ సేవే మాధవ సేవ
మారుమూల ప్రాంతంలో దవాఖానను నిర్మిస్తున్న శ్రీ షిర్డీసాయి ట్రస్ట్ను మంత్రి హరీశ్రావు అభినందించారు. దవాఖానకు ప్రభుత్వం తరుఫున అన్నివిధాలా మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మానవ సేవే మాధవ సేవ అన్న నిజాన్ని తెలుసుకొని అందరూ సేవాగుణాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దేశంలో వైద్యసదుపాయాలు పెంచటంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో చంద్రభాను సత్పతి, డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి, జస్టిస్ నవీన్రెడ్డి, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వెంకటవీరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా నారాయణపురంలో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ దవాఖాన నమూనాను పరిశీ లిస్తున్న మంత్రి హరీశ్రావు.
చిత్రంలో ఎంపీ ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర, సతీశ్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి