కరీంనగర్ : కరోనా కాలంలో ఆశ కార్యకర్తలు అందించిన సేవలు వెలకట్టలేనివని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆశ కార్యకర్తలకు 4జి స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి, రెండు డోసులను విజయవంతంగా పూర్తి చేసి జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపడంలో ఆశ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషించారని ప్రశంసించారు.
ఆశ కార్యకర్తలు ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం, సాంకేతికను అందిపుచ్చుకోవడానికి స్మార్ట్ ఫోన్ లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. స్మార్ట్ ఫోన్ల వల్ల గర్భిణిల ఆరోగ్య సమాచారాన్ని అక్కడికక్కడే ఆన్లైన్లో నమోదు చేసే వీలు ఉంటుందన్నారు. సుమారు 650 మంది ఆశ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.