మెదక్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రక్తం పంచుకుని పుట్టిన సొంత తమ్ముడే అన్నను హతమార్చిన విషాదకర సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోచోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నర్సాపూర్ పట్టణానికి చెందిన చిత్తారి బుచ్చమ్మ, నర్సింలు దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు లక్ష్మణ్ అలియాస్ ఓంకార్( 38) చిన్న కుమారుడు శేఖర్ ఉన్నారు. కాగా పెద్ద కుమారుడు లక్ష్మణ్ ఇంటి వద్దనే ఉంటున్నాడు. చిన్న కుమారుడు శేఖర్ పటన్ చెరులో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
అయితే గత రెండు నెలల కిందట లక్ష్మణ్ అతని భార్య తో గొడవ పడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. అప్పటినుంచి మనస్థాపం చెందిన లక్ష్మణ్ గత కొన్ని రోజుల నుంచి మద్యం మత్తులో తన తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ కొడుతున్నాడు. వేధింపులు తాళలేక తల్లిదండ్రులు సోమవారం తన చిన్న కుమారుడు శేఖర్ను పిలిపించి విషయం చెప్పారు.
ఈ సమయంలో తన తమ్ముడి ఎదుటనే అన్న లక్ష్మణ్ తల్లిదండ్రులను కొట్టాడు. అయితే ఇద్దరు అన్నదమ్ములు సోమవారం ఇంట్లో మద్యం సేవించారు. దీంతో మాట మాట పెరుగడంతో తీవ్ర కోపోద్రిక్తుడు అయిన శేఖర్ తన అన్న లక్ష్మణ్ని కూరగాయలు కోసే కత్తి తో హత్య చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గంగరాజు తెలిపారు.