తెలుగుయూనివర్సిటీ, నవంబర్ 19: సాహితీ రంగంలో యువత కనిపించడం లేదన్న వాదనకు తెరదించుతూ పాఠశాల విద్యార్థులను కవులు, రచయితలుగా తెలంగాణ సారస్వత పరిషత్ తీర్చిదిద్దడం హర్షించదగ్గ విషయమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అన్నారు. పాఠశాల విద్యార్థుల కోసం తెలంగాణ సారస్వత పరిషత్ రాష్ట్రస్థాయి కవితా, కథా రచన పోటీలను నిర్వహించి శుక్రవారం పరిషత్తు ప్రాంగణంలోని దేవులపల్లి రామానుజరావు కళా ప్రాంగణంలో విజేతలకు బహుమతులను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ 78 ఏండ్ల చరిత్ర గల సారస్వత పరిషత్ వేదికపై బహుమతులు అందుకోవడాన్ని విద్యార్థులు అదృష్టంగా భావించాలన్నారు. విద్యతో పాటు సాహిత్యం, ఇతర అంశాలపై జ్ఞానాన్ని సముపార్జించి ఉన్నతంగా ఎదగాలన్నారు. పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ సారస్వత పరిషత్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. పరిషత్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య మాట్లాడుతూ కరోనా కాలంలోనూ విద్యార్థుల నుంచి పోటీలకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత చొక్కాపు వెంకటరమణ మాట్లాడుతూ భవిష్యత్లో మరిన్ని మంచి కథలు వచ్చేందుకు ఈ పోటీలు దోహదపడ్డాయన్నారు. బాలచెలిమి వ్యవస్థాపకుడు ఎం.వేదకుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పిల్లలు ఉత్సాహంతో రచనలు చేస్తున్నారన్నారు. బాల సాహితీవేత్త దాసరి వెంకటరమణ మాట్లాడుతూ సృజనాత్మకతతో రచనారంగంలో రాణించవచ్చని సూచించారు. ఈ పోటీలకు బాల సాహితీవేత్తలు డాక్టర్ వి.ఆర్ శర్మ, డాక్టర్ సిరి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో ప్రథమ విజేతైన విద్యార్థికి రూ.5 వేలు, ద్వితీయ బహుమతి రూ.3 వేలు, తృతీయ బహుమతి రూ.2 వేలతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించారు.
ప్రత్యేక బహుమతులు..
కె.తనూజ (నిజామాబాద్ జిల్లా ముబారక్నగర్), యం.గంగాదేవి(నిజామాబాద్ జిల్లా తడపాకల్), కె.ఉదయకిరణ్ (సంగారెడ్డి జల్లా ఐడీఏ బొల్లారం), సీహెచ్. హరిచందన(నల్లగొండ జిల్లా మిర్యాలగూడ), యన్.నిఖిత( నల్లగొండ జిల్లా, వెంకిర్యాల) అమృతహాసిని(హైదరాబాద్), చింతలపూడి అంజలి(మౌలాలి), కె.ప్రవీణ్, టి.దీపిక(మెదక్ జిల్లా వెంకటాయపల్లి), సింధు(రంగారెడ్డి జిల్లా మాలికదానిగూడ), యం.గోపాల్(రంగారెడ్డి జిల్లా మహేశ్వరం), కె.అనూష(కరీంగనర్ జిల్లా కేశవపట్నం).
కవితా రచనలో..
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాలకు చెందిన ఇ.రాందాస్ నాయక్ ప్రథమ బహుమతి, వరంగల్ జిల్లా ఎల్కతుర్తికి చెందిన రాసమల్ల అక్షయ ద్వితీయ బహుమతి, దిల్సుఖ్నగర్ చెందిన వివేక్కృష్ణ తృతీయ బహుమతి గెలుచుకున్నారు. బి.స్వప్న(నారాయణ పేట జిల్లా పులిమామిడి), కయ్యాల అక్షయ( మహబూబాబాద్ జిల్లా మరిపెడ), ఋషి సంహిత(మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్), గాజుల హర్షిత( మంచిర్యాల జిల్లా గోపాల్నగర్), గడ్డం శ్రావణి(జగిత్యాల జిల్లా బీర్పూర్), యం.సాయిరాం(సిరిసిల్ల), యం.శ్రావణి(సిరిసిల్ల జిల్లా చంద్రంపేట), కోట యువరాజు(ఖమ్మం జిల్లా కలకోట), యం.గంగాదేవి(నిజామాబాద్ జిల్లా తడపాకల్), కె.అంజన(సిద్దిపేట జిల్లా కుకునూర్పల్లి), జి.రమణ (యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్), యం.సారిక (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూనవరం), యం.భావన (మెదక్), బి.శ్వేత (మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారం), చిత్రకవి నాగహాసిని (సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం) ప్రత్యేక బహుమతులు అందుకున్నారు.
కథా బహుమతులు..
నారాయణపేట జిల్లా పులిమామిడికి చెందిన బి.స్వప్నకు ప్రథమ బహుమతి, నిజామాబాద్ జిల్లా ముబారక్నగర్కు చెందిన బి.శ్రీహితకు ద్వితీయ బహుమతి, నల్లగొండ జిల్లా వల్లాలకు చెందిన జోలం మాధురి, మెదక్ జిల్లా తూప్రాన్కు చెందిన కె.స్ఫూర్తికి తృతీయ బహుమతి లభించింది.