కొత్తపల్లి, మార్చి 13 : మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో కరీంనగర్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం రంగారెడ్డితో జరిగిన ఉత్కంఠ పోరులో స్కోర్లు సమం కాగా.. షూటౌట్లో కరీంనగర్ 5-3తో విజేతగా నిలిచింది. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ విజేతలకు ట్రోఫీలు ప్రదానం చేశారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో కరీంనగర్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్రావు తదితరులు పాల్గొన్నారు. విజేత కరీంగనర్కు రూ.50 వేలు, రన్నరప్ రంగారెడ్డికి రూ.30 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన వనపర్తికి రూ.20 వేలు అందజేశారు.