యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ నెల 21న 9 గంటలకు అంకురార్పణతో యాగాలను ప్రారంభిస్తామని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. శుక్రవారం మీడియాకు పలు వివరాలు వెల్లడించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు రోజూ ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు. 28న పూర్ణాహుతి పూర్తయిన అనంతరం ఉదయం 11.55 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ, ఆ తర్వాత స్వయంభువుల దర్శనం ఉంటుందని తెలిపారు. 28న దర్శనాలు ప్రారంభమైన అనంతరం కొండపైకి 75 బస్సులను నడిపిస్తామని, భక్తులకు ఎనిమిది రోజులపాటు దీక్షాపరుల మండపంలో భోజన వసతి కల్పిస్తామని చెప్పారు.
యాదాద్రి, మార్చి 18 : మహాకుంభ సంప్రోక్షణ అనంతరమే స్వయంభువుల దర్శనాలు ఉంటాయని ఆలయ ఈఓ ఎన్.గీత తెలిపారు. యాదాద్రి కార్యనిర్వాహక కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో ఆమె మాట్లాడారు. మహాకుంభ సంప్రోక్షణ సమయంలో భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ నెల 21న 9 గంటలకు అంకురార్పణతో యాగాలు ప్రారంభిస్తామని తెలిపారు. 27వరకు రోజూ ఉదయం, సాయంత్రం పూజా కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. బాలాలయంలో ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు కొనసాగుతాయన్నారు. 28న ఉదయం పూర్ణాహుతి పూర్తయ్యాక 11.55గంటలకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. బాలాలయంలో యాగశాలలు పూర్తి కావచ్చాయన్నారు. మహా సంప్రోక్షణ కార్యక్రమంలో 125మంది రుత్వికులు, పారాయణం దారులు, పారాయణీకులు పాల్గొంటారని, వీరు రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి ఈ నెల 20న యాదాద్రికి చేరుకుంటారని తెలిపారు. మూలమంత్ర జపాలు, పారాయణాలు, ఇతర మతపరమైన కార్యక్రమాలు ప్రధానార్చకుల నేతృత్వంలో జరుగుతాయన్నారు. బాలాలయంలో జరిగే యాగాలను భక్తులు దర్శించుకోవచ్చన్నారు. ప్రధానాలయంలో సంప్రోక్షణ, నృసింహ మూలమంత్ర జపాలు 108 రుత్వికులతో చేపట్టనున్నట్లు తెలిపారు.
ఈ నెల 27వరకు బాలాలయంలో సువర్ణమూర్తుల దర్శనాలకు భక్తులకు అనుమతి ఉంటుందని, 28న ఉదయం స్వామికి పూర్ణాహుతి, యాగఫలం సమర్పించిన అనంతరం సువర్ణమూర్తులను శోభాయాత్రతో ప్రధానాలాయానికి తీసుకొస్తామన్నారు. ఉదయం 11.55గంటలకు జరిగే మహాసంప్రోక్షణ అనంతరం బాలాలయంలో సువర్ణమూర్తులను వేంచేపు చేస్తామన్నారు. తదనంతరం మత పరమైన కైంకర్యాలు పూర్తైన వెంటనే స్వయంభువుల దర్శనాలు ప్రారంభిస్తామని వివరించారు.
మార్చి 28న దర్శనాలు ప్రారంభమయ్యాక కొండపైకి 75బస్సులు నడిపిస్తామని ఈఓ తెలిపారు. కొండకింద బస్బే నుంచి తులసీ కాటేజీ, కల్యాణకట్ట, సత్యనారాయణ స్వామి వ్రత మండపాల వద్ద ఉన్న భక్తులను కొండపైకి తెచ్చేందుకు బస్సుల సౌకర్యం ఉంటుందన్నారు. కొండపై రద్దీ ఎక్కువైతే బస్సులు తాత్కాలికంగా నిలిపివేసి, రద్దీ తగ్గాక తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. దర్శనానికి వచ్చే భక్తుడికి జియో ట్యాగింగ్ ఉంటుందన్నారు. దీంతో ఎంతమంది భక్తులు దర్శనానికి వస్తున్నారో తెలుస్తుందని తెలిపారు. కల్యాణకట్ట, పుష్కరిణి భక్తులకు అందుబాటులోకి వచ్చాయన్నారు. కొండపైకి బస్సుల ట్రయల్ రన్ ఈ నెల 25న నిర్వహిస్తామని, 28వ తేదీ లోపు బస్సులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి 9.30గంటల వరకు దీక్షాపరుల మండపంలోని ఒక హాల్లో భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.