హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ మరో మైలురాయికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే రెండు థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లు ఉండగా, 800 మెగావాట్ల సామర్థ్యంతో మూడో ప్లాంటు నిర్మాణానికి రెడీ అవుతున్నది. అంచనా వ్యయం రూ. 6,790 కోట్లుగా నిర్ణయించింది. ఇందుకు సంబంధిం చి సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. శుక్రవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ శ్రీధర్ అధ్యక్షతన 561వ బోర్డు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కొత్త థర్మల్ పవర్ ప్లాంటు డీపీఆర్కు సమావేశంలో ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న ప్లాంట్లలో 1,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నది. కొత్తగా నిర్మించే ప్లాంటుతో కలిపి 2 వేల మెగావాట్లు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటులో ఉత్పత్తి కానున్నది. ప్రస్తుతం 1,200 మెగావాట్ల (600 మెగావాట్ల చొప్పున) ద్వారా సంస్థ ఏడాదికి రూ.500 కోట్ల వరకు లాభాలు ఆర్జిస్తున్నది. కొత్త యూనిట్ పూర్తయితే సంస్థ ఆర్థిక సుస్థిరతకు దోహదపడుతుందని భావిస్తున్నట్టు సీఎండీ తెలిపారు.
95 శాతం ఉద్యోగాలు స్థానికులకే
ఇకపై జరగనున్న ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ శాతాన్ని పెంచడానికి బోర్డు ఆమోదం తెలిపింది. సింగరేణి విస్తరించి ఉన్న 4 ఉమ్మడి జిల్లాల వారి కి ఇప్పటివరకు అధికారేతర ఉద్యోగాల్లో 80 శాతం, అధికారుల ఉద్యోగాల్లో 60 శాతం స్థానిక రిజర్వేషన్లను వర్తింపజేస్తున్నామని సీఎండీ తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రెండు క్యాటగిరీల్లోనూ స్థానిక రిజర్వేషన్ 95శాతానికి పెంపునకు బోర్డు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. దీనివల్ల సింగరేణి విస్తరించిన 4 ఉమ్మడి జిల్లాల (ప్రస్తుతం 16 జిల్లాలు) ఉద్యోగార్థులు ఇకపై సింగరేణి ప్రకటించే ఎగ్జిక్యూటివ్, ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్ పొందుతారు. మిగిలిన ఐదు శాతం ఉద్యోగాలను ఓపెన్ క్యాటగిరీలో భర్తీ చేస్తారు. సింగరేణిలోని వివిధ గనులు, శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫాం పంపిణీకి తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ ద్వారా 2 కోట్ల వ్యయంతో నామినేషన్ పద్ధతి న వస్ర్తాల కొనుగోలుకు బోర్డు ఆమోదం తెలిపింది.
50 వేల టన్నుల పేలుడు పదార్థాల ప్లాంటు
సింగరేణి ఏడాదికి 700 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. ఇందుకు అవసరమైన పేలుడు పదార్థాల సరఫరాలో ఆటంకం లేకుం డా ఉండేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో కలిసి మందమర్రి వద్ద 50 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సమావేశంలో రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.