న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనల విషయంలో వారం రోజుల్లోగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని పతంజలి వ్యవస్థాపకులు రాందేవ్ బాబా, బాలకృష్ణలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గత ఉత్తర్వుల్లో కోర్టు ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులేం కాదు మీరు అని వారిపై మండిపడింది. మీ తప్పును ఒప్పుకుంటూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని నిర్దేశించింది.
తప్పుదోవ పట్టించే ప్రకటనలో కేసులో మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణకు రాందేవ్ బాబాతోపాటు బాలకృష్ణ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ కలిసి మరోసారి కోర్టులో బేషరతుగా క్షమాపణలు చెప్పారు. కేసు తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 23వ తేదీకి వాయిదా వేసింది.